ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఆస్థానా... వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం...

ABN , First Publish Date - 2021-07-29T22:42:30+05:30 IST

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్థానాను నియమించడాన్ని

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఆస్థానా... వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం...

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేశ్ ఆస్థానాను నియమించడాన్ని ఆ రాష్ట్ర శాసన సభ గురువారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనను ఆమ్ ఆద్మీ పార్టీకి భయోత్పాతం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రతిపాదించిన తీర్మానాన్ని శాసన సభ ఆమోదించింది. 


సంజీవ్ ఝా ప్రవేశపెట్టిన తీర్మానంపై ఢిల్లీ రాష్ట్ర హోం మంత్రి సత్యేంద్ర జైన్ సహా ఆరుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. రాకేశ్ ఆస్థానాపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎమ్మెల్యే రామ్‌వీర్ సింగ్ బిధూరీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. 


రాకేశ్ ఆస్థానా నియామకం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ తీర్మానం కోరింది. ఆయనకు బదులుగా వేరొక అధికారిని నియమించేందుకు తాజాగా ప్రక్రియను ప్రారంభించాలని కోరాలని తెలిపింది. 


చాలా రాష్ట్రాల పోలీసు శాఖలకు అధిపతిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వ్యవహరిస్తారని, ఢిల్లీకి కమిషనర్ ఉంటారని చెప్తూ, ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, పదవీ విరమణకు ముందు కనీసం ఆరు నెలల సర్వీస్ ఉన్నవారిని మాత్రమే డీజీపీగా నియమించాలని సుప్రీంకోర్టు చెప్పిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాకేశ్ ఆస్థానా నియామయంతో ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించినట్లేనని ఆరోపించారు. 



Updated Date - 2021-07-29T22:42:30+05:30 IST