ఈ లక్షణాలున్నాయా.. అయితే వడదెబ్బే.. జాగ్రత్తపడండి..!
ABN , First Publish Date - 2022-04-28T22:03:22+05:30 IST
వేడెక్కుతోంది. 40 డిగ్రీలు, ఆపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంటా, బయటా ఎండ, వేడితో జనం అల్లాడుతున్నారు. రేకులు, పై అంతస్తుల్లో ఉన్న వారి
డీ హైడ్రేషన్తో చతికిలపడుతున్న జనం
ఆస్పత్రిలో చేరుతున్న బాధితులు
జ్వరం లక్షణాలు, కండరాల నొప్పులతో సతమతం
ఉదయం ఎనిమిది అయిందంటే చాలు.. నగరం
వేడెక్కుతోంది. 40 డిగ్రీలు, ఆపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంటా, బయటా ఎండ, వేడితో జనం అల్లాడుతున్నారు. రేకులు, పై అంతస్తుల్లో ఉన్న వారి పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంటోంది. వడదెబ్బకు గురై కొందరు ఆస్పత్రి పాలవుతున్నారు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): వారం రోజులుగా నగరంలో వేడిగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం పన్నెండు, ఒంటి తర్వాత వేడి మరింత ప్రభావం చూపుతోంది. ఎండల కారణంగా అస్వస్థతకు గురైన వారు ప్రతీ ఆస్పత్రిలోనూ రోజుకు ఇద్దరు, ముగ్గురు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఓపీకి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. స్థానిక క్లినిక్లను చాలా మంది ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బతో అస్వస్థత చెందిన 37 మందిని ఆస్పత్రులకు తరలించినట్లు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈంఆర్ఐ) అధికారులు తెలిపారు. ఇందులో 15 మంది నగరవాసులే ఉన్నారు. ఎండలో తిరగడం, శరీరంలో నీటి శాతం తగ్గడంతో వడదెబ్బ బారిన పడుతున్నారని వైద్యులు వివరించారు. వారం, పది రోజులుగా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.
హీట్ స్ర్టోక్ ముప్పు
డీ హైడ్రేషన్, హై ఫీవర్, తల, కండరాల నొప్పులతో కొందరు వైద్యులను సంప్రదిస్తున్నారు. నోరు ఎండిపోవడం, ఒంట్లో సత్తువ సన్నగిల్లడం, అలసట, తలతిరగడం, నీరసం, విరేచనాలు, శరీరం వేడక్కడం, అతిసార, గొంతు సమస్యలు కూడా చాలా మందిని పట్టిపీడిస్తున్నాయి. వేసవిలో మూత్రపిండాల సమస్యతో వచ్చే కేసులు ఉస్మానియా ఆస్పత్రిలో పెరిగినట్లు (రోజుకు 15) వైద్యులు తెలిపారు. ఎండలో అయిదు నుంచి ఎనిమిది గంటల పాటు గడిపితే వృద్ధులకు హీట్స్ట్రోక్ ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మైగ్రేన్, హై ఫీవర్, నొప్పులు, కాళ్లు, చేతులు లాగడం, నీళ్లు తాగిన వెంటనే వాంతులు కావడం వంటి సమస్యలు ఉత్నన్నమవుతాయని వెల్లడించారు. వేసవిలో నీటి కాలుష్యంపై కూడా జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. కలుషిత నీళ్ల వల్ల జీర్ణకోశ, డయేరియా సమస్యలు వస్తాయన్నారు.
వడదెబ్బ లక్షణాలు
శరీరంలో సత్తువ కోల్పోవడం, బరువు తగ్గడం
నీరసంగా, చికాగ్గా ఉండడం
కండరాలు పట్టేయడం, తలనొప్పి
విపరీతంగా జ్వరం,
సొమ్మసిల్లడం (కొందరు)
మూత్రం పచ్చగా రావడం
నోరు, నాలుక ఎండిపోవడం (కొందరికి)
వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి
వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. వీక్నెస్, జ్వరం లక్షణాలతో వస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కవగా ఉంటున్నారు. జ్వరం, శరీరపు నొప్పులు, తలనొప్పి, డయేరియా సమస్యలుంటే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నాం. ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు ఇచ్చి నయం చేస్తున్నాం.
- డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ ఆస్పత్రి