పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ ఘాటు హెచ్చరిక

ABN , First Publish Date - 2021-11-20T23:40:53+05:30 IST

అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించే శత్రు దేశాలకు

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ ఘాటు హెచ్చరిక

న్యూఢిల్లీ : అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించే శత్రు దేశాలకు ‘నవ భారత దేశం’ దీటుగా జవాబు చెప్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌లో శనివారం షహీద్ సమ్మాన్ యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మన దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ అనేక ప్రయత్నాలు చేస్తోందని, ఆ ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామని ఆ దేశానికి స్పష్టమైన సందేశం పంపించినట్లు చెప్పారు. ‘‘ఇది నూతన, శక్తిమంతమైన భారత దేశం’’ అన్నారు. 


భద్రతా దళాల కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నష్టపరిహారాన్ని నాలుగు రెట్లు పెంచినట్లు తెలిపారు. ఈ పరిహారం గతంలో రూ.2 లక్షలు ఉండేదని, దీనిని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.8 లక్షలకు పెంచిందని చెప్పారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటోందన్నారు. భారత్ ఎన్నడూ ఇతర దేశాలపై దాడి చేయలేదన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగియుండటం భారత దేశ సంస్కృతి అని చెప్పారు. కొందరికి ఈ విషయాలు అర్థం కావన్నారు. 


పాకిస్థాన్ గడ్డపై నుంచి మన దేశానికి ముప్పు వస్తే, అక్కడికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు జరిపేందుకు వెనుకాడబోమని హెచ్చరించామన్నారు. మనకు మరో పొరుగు దేశం ఉందని, దానికి ఈ విషయాలేవీ అర్థం కావడం లేదని చైనాను పరోక్షంగా ప్రస్తావిస్తూ చెప్పారు. 


ఉత్తరాఖండ్‌లో సైన్య ధామాన్ని నిర్మిస్తామని, దీని కోసం రాష్ట్రంలోని 1,734 మంది అమరుల కుటుంబాలు నివసిస్తున్న ఇళ్ల నుంచి మట్టిని సేకరిస్తామని చెప్పారు. 


Updated Date - 2021-11-20T23:40:53+05:30 IST