ఈ ఏడాది నుంచే నాలుగేళ్ల డిగ్రీ
ABN , First Publish Date - 2021-06-17T17:10:03+05:30 IST
జాతీయ విద్యావిధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)కు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు ప్రారంభించాలని వైస్ చాన్స్లర్లకు ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్
- జాతీయ విధానానికి అనుగుణంగా మార్పులు
- వీసీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆదేశాలు
బెంగళూరు: జాతీయ విద్యావిధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)కు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు ప్రారంభించాలని వైస్ చాన్స్లర్లకు ఉన్నతవిద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థనారాయణ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు అక్టోబరు తొలివారం నుంచే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలన్నారు. బీఎస్సీలో ప్రవేశానికి ప్రత్యేక పరీక్షలు ఉండవన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం యూనివర్సిటీల వీసీలకు మంగళవారం ప్రత్యేకంగా లేఖలు రాశారు. వర్చువల్ రూపంలో సమీక్ష నిర్వహించారు. ద్వితీయ పీయూ పరీక్షలు రద్దు చేసిన తరుణంలో అందరూ ఉత్తీర్ణులయ్యారని, డిగ్రీలో అన్ని కోర్సులకు డిమాండ్ ఏర్పడనుందని ఇదో సువర్ణ అవకాశంగా భావించి నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రారంభించాలని సూచించారు. అందుకు తగిన కార్యాచరణకు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అన్ని కమిటీలు జూలై 15లోగా నివేదికలు సమర్పించాలన్నారు. ప్రస్తుత తరుణంలో కొవిడ్ వైరస్ పూర్తిగా నిర్మూలన అయ్యే అవకాశాలు లేవన్నారు. విద్యార్థులకు ఆఫ్లైన్, ఆన్లైన్లలోనూ అవకాశాలు ఉంటాయని వారు సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. 2021-22 విద్యా సంవత్సరం అక్టోబరు మొదటివారం నుంచే ప్రారంభానికి సన్నద్ధం కావాలన్నారు. బీఎస్సీలో ప్రవేశానికి సీఈటీ పరీక్ష జరపడం లేదన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అనుసంధానం చేసి ఏకీకృత విశ్వ విద్యాలయాలు, కళాశాల నిర్వహణ ద్వారా విద్యార్థుల వివరాలను నమోదు చేయదలిచామని ఇందుకోసం ప్రత్యేక డిజిటల్ పోర్టల్ను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈనెల 25నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుందన్నారు.