నేతాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించండి: మమత
ABN , First Publish Date - 2022-01-23T17:07:04+05:30 IST
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏటా జనవరి 23వ తేదీని జాతీయ సెలవుదినంగా (నేషనల్ హాలిడే) ప్రకటించాలని..
కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏటా జనవరి 23వ తేదీని జాతీయ సెలవుదినంగా (నేషనల్ హాలిడే) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. నేతాజీ దేశనేతే కాకుండా ప్రపంచ నేత అని, బెంగాల్ నుంచి ఆయన ఎదిగిన తీరు దేశచరిత్రలోనే నిలిచిపోతుందని ఆమె అన్నారు.
''దేశనాయక్ దివస్ను అత్యంత వైభవోపేతంగా యావత్ దేశం జరుపుకొనేందుకు వీలుగా నేతాజీ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ మమతా బెనర్జీ ఆదివారంనాడు ట్వీట్ చేశారు. దేశభక్తి, ధైర్యం, నాయకత్వం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక బోస్ అని ఆమె ప్రశంసించారు. అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూనే బోస్ 125వ జయంతిని 'దేశ్ నాయక్ దివస్'గా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని ఆమె తెలిపారు. నేతాజీ స్మారకార్థం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్తో జాతీయ యూనివర్శిటీ, 100 శాతం రాష్ట్ర నిధులతో జై హింద్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని మమత చెప్పారు.