కుమార్తె అంత్యక్రియలకు సాయం కోరిన తండ్రి... ముందుకురాని చుట్టుపక్కలవారు!
ABN , First Publish Date - 2021-06-14T16:08:02+05:30 IST
కరోనాకాలంలో తోటివారి నుంచి కనీస సహాయం...
గోపాల్గంజ్: కరోనాకాలంలో తోటివారి నుంచి కనీస సహాయం కూడా కరువవుతోంది. బీహార్లోని గోపాల్ గంజ్లో ఒక తండ్రికి చుట్టుపక్కలవారి నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. గోపాల్గంజ్లోని బరౌలి బ్లాక్లో నివసిస్తున్న ఒక తండ్రి తన కుమార్తె మృతి అనంతరం చుట్టుపక్కలవారి సహాయం కోరాడు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. పరశురాం ప్రసాద్ బరౌలీలో పకోడీలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఆయన కుమార్తె మృతి చెందింది.
కుమార్తె అంత్యక్రియలు చేసేందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు. దీంతో డబ్బుల కోసం చుట్టుపక్కల వారిని ప్రాధేయ పడ్డాడు. అయితే ఆయనకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పరశురామ్ ప్రసాద్ కుమార్తె కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో ఆయన దగ్గరకు ఎవరూ రాలేదు. కాగా అతని కుమారుడు చలి, జ్వరంతో బాధపడుతూ 14 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే 18 ఏళ్ల చిన్న కుమార్తె కాజల్ కుమారి మృతి చెందింది. ఎట్టకేలకు బరౌలి నగర పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సప్నా సహకారంతో పరశురాం ప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు నిర్వహించారు.