చిన్నారిని బలితీసుకున్న విధి
ABN , First Publish Date - 2022-01-24T04:48:07+05:30 IST
మేనబావతో పాటు ఆనందంగా సైకిల్పై వచ్చిన అభంశుభం తెలియని ఆ చిన్నారిని విధి బలితీసుకుంది. సైకిల్పై కూర్చోబెట్టి మేనమామ షాపులోకి వెళ్లిన సమయంలో ఓ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఆదివారం జరిగింది.
సైకిల్పై కూర్చోబెట్టి షాపులోకి వెళ్లిన మేనబావ
ఈలోపు మృత్యువులా దూసుకొచ్చిన వాహనం
అక్కడికిక్కడే బాలుడు మృతి
చింతకాని మండలంలో ఘటన
చింతకాని, జనవరి 23: మేనబావతో పాటు ఆనందంగా సైకిల్పై వచ్చిన అభంశుభం తెలియని ఆ చిన్నారిని విధి బలితీసుకుంది. సైకిల్పై కూర్చోబెట్టి మేనమామ షాపులోకి వెళ్లిన సమయంలో ఓ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఆదివారం జరిగింది. పాతర్లపాడు గ్రామానికి చెందిన జూపుడి వీరయ్య, సుభద్ర దంపతుల కుమారుడు జూపుడి మోషా (4)ను వీరయ్య మేనల్లుడైన పదమూడేళ్ల వెంగళదాసు లోకేశ్ సరదాగా వెంటబెట్టుకుని తన సైకిల్పై గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనున్న ఓ కిరాణా షాపు వద్దకు తీసుకెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో లోకేశ్ మరో వస్తువు మర్చిపోయానంటూ మోషాను సైకిల్పైనే కుర్చోబెట్టి షాపు లోపలికి వెళ్లాడు. ఇంతలోనే అదే మార్గంలో చింతకాని నుంచి పాతర్లపాడు మీదుగా నాగులవంచ వైపు వెళ్తున్న ఓ వాహనం రోడ్డు పక్కకు దూసుకొచ్చి మోషా కూర్చున్న సైకిల్ను ఢీకొట్టింది. దీంతో మోషా కింద పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలాన్ని చింతకాని ఎస్ఐ లవన్కుమార్ పరిశీలించి వివరాలు నమోదు చేసుకుని బాలుడి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జూపుడి వీరయ్య, సుభద్ర దంపతులకు కూతురు, కుమారుడు ఉండగా.. వారిలో కుమారుడు ప్రమాదవశాత్తు మృతిచెందడంతో తల్లితండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.