రెప్పపాటులో మృత్యు ఒడికి
ABN , First Publish Date - 2022-08-16T07:42:50+05:30 IST
వారు నలుగురూ స్నేహితులు.
- రోడ్డు ప్రమాదంలో నలుగురు
- మిత్రులు మృతి.. అందరూ ఆర్కిటెక్ట్లే
- గుంటూరు జిల్లా తుమ్మలపాలెం హైవేపై
- ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు
- ప్రమాదానికి అతి వేగమే కారణం!
- అరుణాచలం వెళ్తుండగా ఘోరం
ప్రత్తిపాడు, ఆగస్టు 15: వారు నలుగురూ స్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఆర్కిటెక్ట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అంతా కలిసి అరుణాచలం వెళ్లి స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకుని.. కారులో బయలుదేరారు. అయితే, రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని మింగేసింది. హృదయాలను ద్రవింపజేసిన ఈ ఘటన వివరాలు.. విజయవాడకు చెందిన చుక్కా గౌతమ్రెడ్డి(26), కాకినాడ జగన్నాథపురానికి చెందిన వాడపల్లి అనంతపద్మ చైతన్యపవన్(27), విశాఖ జిల్లా పెందుర్తి మండలం దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన పిరిడి శౌమిక(25) విశాఖకు చెందిన పావని(24) విజయవాడలోని ఓ ఆర్కిటెక్ కాలేజీలో 2014-19 బ్యాచ్ మేట్స్. తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరిలో ముగ్గురు విజయవాడలోనే ఉద్యోగం చేస్తుండగా.. శౌమిక మాత్రం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.
వీరు నలుగురు కలిసి ఒక ప్రాజెక్టు వర్కు చేస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో వారు తమిళనాడులోని అరుణాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం విజయవాడ నుంచి అరుణాచలం వెళ్లేందుకు గౌతమ్రెడ్డి కారులో బయలుదేరారు. సాయంత్రం 4 గంటల సమయంలో గుంటూరు జిల్లా తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణంగా అదుపు తప్పి.. రెప్పపాటులో రోడ్డు పక్కన టైరు మార్చుకునేందుకు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ప్రత్తిపాడు ఎస్ఐ ప్రతా్పకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.