సీఎం గారూ... మా డబ్బులు మాకివ్వండి
ABN , First Publish Date - 2020-10-20T09:16:07+05:30 IST
గ్రేటర్ విశాఖ మహా నగరపాలక సంస్థ నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ అయిన రూ.120 కోట్లను వెంటనే విడుదల
ముఖ్యమంత్రికి వెలగపూడి లేఖ
విశాఖపట్నం: అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ విశాఖ మహా నగరపాలక సంస్థ నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ అయిన రూ.120 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం లేఖ రాశారు. జీవీఎంసీ పరిధిలో వివిధ పన్నుల రూపేణా వసూలైన రూ.120 కోట్లు సీఎఫ్ఎంఎస్ ద్వారా ప్రభుత్వానికి జమ అయ్యావని లేఖలో పేర్కొన్నారు.
అయితే జీవీఎంసీ పరిధిలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు 15 నెలల నుంచి రూ.300 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో టెండర్లు ఖరారైనా పనులు చేపట్టడం లేదని, కొత్తగా పనులకు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో రోడ్లు దారుణంగా దెబ్బతిని వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో నగరంలో పనుల కోసం సీఎఫ్ఎంఎస్ ద్వారా రావలసిన రూ.120 కోట్లు తక్షణమే విడుదల చేయాలని లేఖలో కోరారు.