విమానంలో మాస్క్ సరిగా ధరించనివారిని దింపేయడమే : డీజీసీఏ
ABN , First Publish Date - 2021-03-13T22:38:55+05:30 IST
విమాన ప్రయాణికులు కోవిడ్-19 నిబంధనలను సక్రమంగా పాటించకపోతే
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులు కోవిడ్-19 నిబంధనలను సక్రమంగా పాటించకపోతే కఠిన చర్యలను ఎదుర్కొనక తప్పదు. విమానంలో మాస్క్ను సరిగా ధరించని, కోవిడ్-19 మార్గదర్శకాలను సక్రమంగా పాటించని ప్రయాణికులను దించేస్తారు. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలను పాటించని ప్రయాణికులను క్రమశిక్షణలేని ప్రయాణికులుగా పరిగణిస్తారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శనివారం విడుదల చేసిన ప్రకటనలో, కొందరు విమాన ప్రయాణికులు కోవిడ్-19 నిబంధనలను పాటించడం లేదని గుర్తించినట్లు పేర్కొంది. విమానాశ్రయంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం పూర్తయిన తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు వెళ్ళే వరకు మాస్క్ను సక్రమంగా ధరించాలని, ముక్కు క్రిందకు మాస్క్ను ధరించడం సరి కాదని తెలిపింది.
కొందరు ప్రయాణికులు విమానాశ్రయంలో మాస్క్ను సక్రమంగా ధరించడం లేదని, భౌతిక దూరాన్ని పాటించడం లేదని పేర్కొంది. విమానంలో కూడా కొందరు ప్రయాణికులు మాస్క్లను ధరించడం లేదని తెలిపింది. విమానంలో ప్రయాణించేటపుడు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, అసాధారణ పరిస్థితుల్లో తప్ప మాస్క్ను ముక్కు క్రిందకు దించరాదని తెలిపింది. మాస్క్ ధరించనివారు విమానాశ్రయంలో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని సీఐఎస్ఎఫ్, ఇతర పోలీసు దళాలను ఆదేశించింది.
కోవిడ్ నిబంధనలను ప్రయాణికులు అన్ని వేళలా, సక్రమంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్/టెర్మినల్ మేనేజర్లను ఆదేశించింది. హెచ్చరించిన తర్వాత కూడా నిబంధనలను పాటించని ప్రయాణికులను భద్రతా సంస్థలకు అప్పగించాలని తెలిపింది. అవసరమైతే ఇటువంటి ప్రయాణికులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపింది. విమానం ఎక్కిన ప్రయాణికుల్లో ఎవరైనా మాస్క్ను నిబంధనల మేరకు ధరించకపోతే, హెచ్చరించాలని తెలిపింది. పదే పదే హెచ్చరించిన తర్వాత కూడా మాస్క్ను సక్రమంగా ధరించకపోతే, ఆ విమానం ఎగరడానికి ముందే ఆ ప్రయాణికుడిని దించేయాలని తెలిపింది.
పదే పదే హెచ్చరించిన తర్వాత కూడా మాస్క్ను ధరించడానికి, కోవిడ్ నిబంధనలను పాటించడానికి తిరస్కరించే ప్రయాణికులను అన్రూలీ ప్యాసింజర్స్గా పరిగణించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.