కుమార్తె బలవంతపు పెళ్లికి తల్లిదండ్రుల యత్నం...అడ్డుకున్నDelhi Womens Commission
ABN , First Publish Date - 2021-10-30T14:09:21+05:30 IST
తన కుమార్తెకు బలవంతంగా వివాహం చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులను ఢిల్లీ మహిళా కమిషన్ అడ్డుకున్న ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది...
న్యూఢిల్లీ : తన కుమార్తెకు బలవంతంగా వివాహం చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులను ఢిల్లీ మహిళా కమిషన్ అడ్డుకున్న ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది.జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల యువతి నేషనల్ క్యాపిటల్ రీజియన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య అభ్యసిస్తోంది. యువతికి ఆమె తల్లిదండ్రులు బలవంతంగా వివాహం జరిపించేందుకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వేస్టేషన్ నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి తీసుకువెళుతుండగా, రంగంలోకి దిగిన ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సహాయంతో రక్షించారు. తనను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని బాధిత యువతి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.
తన తల్లిదండ్రులు ఎవరితో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం కూడా ఆమె తెలియజేయలేదు.దీంతో ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. యువతికి అవసరమైనప్పుడు కమిషన్ తన మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చింది.యువతి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే తాము రైలు ఆపి బాధిత యువతిని రక్షించామని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మలివాల్ చెప్పారు. ‘‘నేడు కొంతమంది తల్లిదండ్రులు యువతుల ఇష్టాన్నికాదని బలవంతంగా వివాహాలు చేస్తుండటం దురదృష్టకరం.పిల్లలు కన్న కలలను వమ్ము చేయవద్దు. ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో యువతులకు సహాయపడాలి, మహిళా కమిషన్ కూడా యువతులకు అండగా నిలుస్తోంది’’ అని స్వాతి మలివాల్ చెప్పారు.