టీఆర్ఎస్, బీజేపీలది దోపిడీ పాలన
ABN , First Publish Date - 2022-08-03T05:32:20+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీలది దోపిడీ పాలన
చరమగీతం పాడేందుకు నిరసన కార్యక్రమాలు
డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి
హనుమకొండ సిటీ, ఆగస్టు 2 : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు దోపిడీ పాలన సాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలది అక్రమ సంబంధమని ఆరోపించారు. ప్రజలను మభ్య పెడుతూ దోపిడే లక్ష్యంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్రెడ్డి మాట్లాడారు.
టీపీసీసీ పిలుపు మేరకు నిత్యావసర ధరల పెంపుదలను నిరసిస్తూ ఈ నెల 5న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలపై నిజంగా ప్రేమే ఉంటే పెంచిన పెట్రో, గ్యాస్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాకంటక పాలనను వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పాదయాత్రలు చేపడుతున్నట్లు రాజేందర్రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి 14 వరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మొత్తం 75 కిలోమీటర్ల మేర పాదయాత్రలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 9న కాజీపేట ఫాతిమానగర్లోని మధర్థెరిస్సా విగ్రహం నుంచి పాదయ్రాత ప్రారంభమవుతుందన్నారు. 10వ తేదీన వర్థన్నపేట, 11న పరకాల, 13న నర్సంపేట, 14న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుందన్నారు. అయితే ఇంకా పాదయాత్రకు సంబంధించి తుది ప్రణాళిక ఖరారు కాలేదని, ప్రకటించిన వాటిలో కొంత మార్పులు ఉండవచ్చన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నమిండ్ల శ్రీనివాస్, బంక సరళ, పులి అనిల్కుమార్, మహ్మద్ అయూబ్, రామక్రిష్ణ, కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.