పగటి కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-06T05:46:49+05:30 IST

కరోనా కట్టడికి ప్రభుత్వం పగటి కర్ఫ్యూ విధించింది.

పగటి కర్ఫ్యూ
మూసివేసిన షాపులు

  1. మధ్యాహ్నం నుంచి దుకాణాలు బంద్‌
  2. తగ్గిన జనసంచారం.. వెలవెలబోయిన రోడ్లు
  3. ఇతర రాష్ట్రాల బస్సులు సరిహద్దుల్లోనే నిలిపివేత


కర్నూలు, మే 5(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి ప్రభుత్వం పగటి కర్ఫ్యూ విధించింది. ఈ మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరవాలని జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ముందే హెచ్చరించింది. అత్యవసర సేవలు, బ్యాంకులు, ఆస్పత్రులు, మందులు షాపుల వంటి వాటికి మినహాయింపు ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం 12 తర్వాత నగరంలో మినహాయించిన షాపులు మినహా మిగతా  అన్ని షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయడంతో రవాణా సేవలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను అలంపూర్‌ టోల్‌ప్లాజా వద్దే నిలిపివేశారు. పోలీసు యంత్రాంగం పలు ప్రాంతాలు, కూడళ్ల వద్ద తిరుగుతూ కర్ఫ్యూను పర్యవేక్షించింది.


తగ్గిన జనసంచారం
పగటి కర్ఫ్యూ విధించడంతో నగరంలోని ముఖ్య కూడళ్ళు, రోడ్ల పక్కనున్న షాపులు మూతపడ్డాయి. రాజ్‌విహార్‌, బస్టాండ్‌, ఆర్‌ఎస్‌ రోడ్డు, పాత బస్టాండ్‌ వంటి రద్దీ ప్రాంతాల్లోని షాపుల యజమానులు మధ్యాహ్నం నుంచి బంద్‌ చేశారు. దీంతో రోడ్లపై జనసంచారం కూడా తగ్గింది. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారు 12 తర్వాత బస్సులు లేకపోవడంతో గమ్యస్థానాలు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు కూడా జిల్లా సరిహద్దులోనే నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్‌ నుంచి వచ్చే పలువురు అలంపూర్‌ టోల్‌ప్లాజా వద్ద దిగి తమ ఇళ్లకు చేరుకునేందుకు ఆటోలు, ఇతర వాహనాల కోసం ఎదురుచూశారు. కొంతమంది తమ వారికి ఫోన్‌ చేసి ద్విచక్ర వాహనాల్లో ఇళ్లకు చేరుకున్నారు.





Updated Date - 2021-05-06T05:46:49+05:30 IST