Dawood Ibrahim కరాచీలో ఉన్నాడు : మనీల్యాండరింగ్ కేసులో ఈడీ
ABN , First Publish Date - 2022-05-24T21:37:59+05:30 IST
ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం (Dawood Ibrahim) పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భావిస్తోంది.
ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం (Dawood Ibrahim) పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్నాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పేర్కొంది. దావూద్ ఇబ్రహింతో ముడిపడివున్న ఓ మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా దావూద్ మేనల్లుడు అలీషా పార్కర్ ఈ విషయాన్ని చెప్పాడని వెల్లడించింది. దావూద్ ఇబ్రహిం సోదరి హసీనా పార్కర్ కొడుకే అలీషా. అయితే దావూద్తో తాను టచ్లో లేనని అలీషా చెప్పాడని ఇటివలే ముంబై కోర్టులో సమర్పించిన చార్జిషీటులో ఈడీ పేర్కొంది. చార్జిషీటు ప్రకారం... దావూద్ ఇబ్రహిం భార్య మెహజాబిన్ ఈద్(పండుగ) లాంటి సందర్భాల్లో పార్కర్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పలకరించేవారని తెలిపింది. అలీషాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ ప్రశ్నించింది. చార్జిషీటుతోపాటు అతడి స్టేట్మెంట్ను కూడా ఈడీ పొందుపరచింది. మరోవైపు ఇదే కేసులో ఎన్సీపీ లీడర్ నవాబ్ మాలిక్ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.
కాగా ఈ కేసులో భాగంగా ఛోటా షకీల్ సహాయకుడు సలీం ఖురేషీని కూడా ఈడీ బృందం గతంలో ప్రశ్నించింది. ఖురేషీ ఫోర్జరీ పాస్పోర్టుపై పలుమార్లు పాకిస్తాన్ వెళ్లినట్టు బయటపడింది. దావూద్ ఇబ్రహిం, ఛోటా షకీల్ తరపున అతడు పనిచేశాడని వివరించింది. ఫిబ్రవరి 3, 2022న ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దావూడ్ ఇబ్రహిం, ఇతరులపై ఈడీ మనీల్యాండరింగ్ చట్టాల కింద దర్యాప్తు మొదలుపెట్టింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. దావూడ్ ఇబ్రహిం, హజీ అన్సీస్ అలియాస్ అనీస్ ఇబ్రహిం షేక్, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, జావీద్ పటేల్ అలియాస్ జావిద్ చిక్నా, ఇబ్రహిం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మీమన్ అలియాస్ టైగర్ మీమన్ నిందితులుగా ఉన్నారు. కాగా భారత్ నుంచి పాకిస్తాన్ పారిపోయిన దావూద్ ఇబ్రహిం.. భారత్లో హసీనా పార్కర్ అలియాస్ హసీనా, ఇతర సహాయకుల ద్వారా భారత్లో తన కార్యకలాపాలను నిర్వహించేవాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది.