కరోనాతో తండ్రి మృతి... చితిలో దూకిన కుమార్తె!
ABN , First Publish Date - 2021-05-05T13:00:04+05:30 IST
కరోనాతో దేశమంతా అల్లాడిపోతోంది. ఇటువంటి సమయంలో...
బార్మెర్: కరోనాతో దేశమంతా అల్లాడిపోతోంది. ఇటువంటి సమయంలో కొన్ని విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో రోమాలు నిక్కబొడుకునే ఒక ఘటన చోటుచేసుకుంది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా తండ్రి మరణించడంతో కుమార్తె ... తండ్రి చితిలో దూకింది. ఫలితంగా ఆమె శరీరం 70 శాతం మేరకు కాలిపోయింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇండో-పాక్ సరిహద్దులోని బార్మెర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బార్మెర్ జిల్లా కేంద్రంలోని రాయ్ కాలనీలో నివసిస్తున్న దామోదర్ దాస్ కోవిడ్ -19 కారణంగా మృతి చెందాడు. దీంతో అతని అంత్యక్రియలకు శ్మశానవాటికలో ఏర్పాట్లు చేశారు. అనంతరం చితి అంటించారు. ఈ సమయంలో మృతుని కుమార్తెలు కూడా అక్కడే ఉన్నారు. ఇంతలో అతని కుమార్తె చంద్ర శారద(30) చితిలోకి దూకింది. దీనిని చూసిన కుటుంబ సభ్యులు హతాసులయ్యారు. అయితే ఆమె సోదరి పింకీ ఆమెను చితి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. అయితే అప్పటికే చంద్ర శారద శరీరం 70 శాతానికిపైగా కాలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు వచ్చి అక్కడి వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాలిన గాయాలతో బాధపడుతున్న మహిళ స్టేట్మెంట్ ఇచ్చే స్థితిలో లేదని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ తెలిపారు. బాధితురాలికి బార్మెర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జోధ్పూర్ ఆసుపత్రికి తరలించారు.