సీఎం గారు మీరేమైనా డాక్టరా?: దాసోజు శ్రవణ్
ABN , First Publish Date - 2021-06-23T22:22:45+05:30 IST
సీఎం గారు మీరేమైనా డాక్టరా?: దాసోజు శ్రవణ్
హైదరాబాద్: కరోనా పట్ల అప్రమత్తతను, జాగ్రత్తలను సూచించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ కరోనా పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించేలా మాట్లాడారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గతంలోనూ ఒకసారి ఇలాగే మాస్క్ల పట్ల కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణలో కొన్ని లక్షల మంది చనిపోయారన్నారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్లోనే లక్ష మంది చనిపోయి ఉంటారని, కానీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని శ్రవణ్ మండిపడ్డారు. ప్రజల్ని చైతన్య పరచాల్సిన సీఎం కరోనా లేదని, బ్లాక్ ఫంగస్ లేదంటున్నారని చెప్పారు. పారాసెటమాల్, డోలో చాలు అంటూ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చశారు. ముఖ్యమంత్రి గారు మీరేమైనా డాక్టరా? అని శ్రవణ్ ప్రశ్నించారు. ప్రజలకు భయం పోవడం వల్లనే కరోనా వ్యాప్తి ఎక్కువ అయిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని కొనసాగించడం కోసమే సీఎం ఇలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. త్వరలో టీపీసీసీ కొత్త నాయకత్వంపై ప్రకటన ఉంటుందని భావిస్తున్నానని దాసోజు శ్రవణ్ తెలిపారు.