పిల్లల కోసం దశావతారాలు

ABN , First Publish Date - 2022-09-23T05:56:26+05:30 IST

పాండవులను అవమానించటానికి దుర్యోధనుడు ఒక కుట్ర పన్నాడు. దీనిలో భాగంగా- అతి కోపిష్టిగా పేరుమోసిన దుర్వాస మహర్షిని..

పిల్లల కోసం దశావతారాలు

పాండవులను అవమానించటానికి దుర్యోధనుడు ఒక కుట్ర పన్నాడు. దీనిలో భాగంగా- అతి కోపిష్టిగా పేరుమోసిన దుర్వాస మహర్షిని.. ఆయన వెయ్యిమంది శిష్యులను ధర్మరాజును చూసి రమ్మని పంపాడు. దుర్యోధనుడి కుతంత్రం తెలియని దుర్వాస మహాముని పాండవుల దగ్గరకు వెళ్లాడు. ఆ సమయానికి మధ్యాహ్నం అయిపోయింది. పాండవులు భోజనాలు చేసేశారు. అక్షయపాత్రను కడిగేశారు. అతిథులు వచ్చారు కాబట్టి వారికి భోజనాలు పెట్టాలి. కానీ భోజనాలు పెట్టడానికి వారి దగ్గర ఎటువంటి ఆహారం లేదు. అక్షయపాత్రను తోమివేశారు కాబట్టి మర్నాటి దాకా భోజనాలు రావు. ఈ సంకట పరిస్థితిలో- ఏమి చేయాలో తెలియని ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది.


అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై- అక్షయపాత్రలో ఒక మూల మిగిలిఉన్న అన్నపు మెతుకు తీసి తిన్నాడు. ‘కడుపు నిండిపోయింది’ అన్నాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాసుడికి.. ఆయన శిష్యులకు కూడా అదే అనుభూతి కలిగింది. ఇది భారతంలో ఒక చిన్న కథ. ఈ కథలోని అక్షయపాత్రలో అన్నం ఎప్పటికీ ఎలా అయిపోదో.. భాగవతం వంటి పురాణాలలో కథలు కూడా ఎప్పుడూ అయిపోవు. అవి మనకు అక్షయపాత్రలు. అలాంటి భాగవత అక్షయపాత్ర నుంచి దశావతార కథలను పిల్లలకు అందించే పుస్తకమే- ముళ్లపూడి శ్రీదేవి రాసిన ‘రమణీయ శ్రీ భాగవతం- దశావతారాలు’. దీనిలోని కథలన్నీ సంభాషణల రూపంలో చక్కగా సాగుతాయి. ప్రముఖ రచయిత ముళ్లపూడి రమణ భార్య అయిన శ్రీదేవి గతంలో ‘రమణీయ శ్రీ రామాయణం’ పుస్తకాన్ని రచించారు. దానికి కూడా విశేషమైన ప్రశంసలు లభించాయి. భాగవతాన్ని పిల్లలకు పరిచయం చేయాలనుకొనేవారందరి దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకమిది. 


రమణీయ శ్రీ భాగవతం

రచయిత్రి: ముళ్లపూడి శ్రీదేవి, ప్రచురణ: అక్షజ్ఞ పబ్లికేషన్స్‌, 

ప్రతులకు: 8712729057

Updated Date - 2022-09-23T05:56:26+05:30 IST