మార్కెట్లకు పోటెత్తిన జనం

ABN , First Publish Date - 2021-10-13T16:08:03+05:30 IST

చెన్నైలోని ప్రధాన మార్కెట్లన్నీ మంగళవారం జనంతో కిటకిటలాడాయి. ఈనెల 15న జరుపుకునే దసరా వేడుకలకు గాను నగరవాసులు అప్పుడే పూజ సామగ్రి, ఇతర సరకులను కొనటానికి మార్కెట్లకు తరలివెళ్ళారు. నగరంలోని ట్రిప్లికేన్‌

మార్కెట్లకు పోటెత్తిన జనం

చెన్నై: చెన్నైలోని ప్రధాన మార్కెట్లన్నీ మంగళవారం జనంతో కిటకిటలాడాయి. ఈనెల 15న జరుపుకునే దసరా వేడుకలకు గాను నగరవాసులు అప్పుడే పూజ సామగ్రి, ఇతర సరకులను కొనటానికి మార్కెట్లకు తరలివెళ్ళారు. నగరంలోని ట్రిప్లికేన్‌, రాయపేట, మైలాపూరు, తిరువాన్మియూరు, కోయంబేడు తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో మహిళలు పూజా ద్రవ్యాలను కొనటానికి దుకాణాల వద్ద బారులు తీరారు. ఇదే విధంగా నగరంలోని వాణిజ్య సంస్థలకు చెందిన సిబ్బంది కూడా ఆయుధ పూజ సామగ్రిని కొనటానికి మార్కెట్ల వద్ద గుమికూడారు. గతేడాది కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆయుధపూజలను నగరవాసులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో దసరా వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు మంగళవారం ఉదయం నగరంలోని మార్కెట్లలో మరమరాలు, అటుకులు, వేరుశెనగలు, చెరకులు, అరటి పిలకలు, మామిడాకులు, గుమ్మడికాయల, కొబ్బరి కాయలు, అరటి పళ్ళను కొనటానికి నగరానికి చెందిన మహిళలు పోటీపడ్డారు. ఇక దసరా సీజన్‌ కారణంగా మారెట్లలో పూల ధరలు విపరీతంగా పెరిగాయని మహిళలు వాపోయారు. కేజీ మల్లెపూలు రూ.800లకు, సంపంగి రూ.250లకు విక్రయిస్తున్నారని వారు తెలిపారు.

Updated Date - 2021-10-13T16:08:03+05:30 IST