Dussehra festival: నగరం నుంచి స్వస్థలాలకు 1.42 లక్షల మంది పయనం

ABN , First Publish Date - 2022-10-02T13:59:56+05:30 IST

దసరా పండుగ(Dussehra festival) సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో నగరం నుంచి శుక్రవారం 1.42 లక్షలమంది తమ

Dussehra festival: నగరం నుంచి స్వస్థలాలకు 1.42 లక్షల మంది పయనం

చెన్నై, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ(Dussehra festival) సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో నగరం నుంచి శుక్రవారం 1.42 లక్షలమంది తమ స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో కోయంబేడు, తాంబరం, పూందమల్లి బస్‌స్టేషన్లలో తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై, తిరునల్వేలి, కడలూరు, తంజావూరు, కన్నియాకుమారి తదితర నగరాలకు వెళ్లే ప్రయాణికులు సకాలంలో బస్సులు రాక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఈ బస్‌స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఇదే విధంగా నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులు కూడా వరుస సెలవులు రావడంతో ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ఆమ్నీ బస్సుల్లో(Omni bus) స్వస్థలాలకు బయలుదేరారు. శని, ఆది వారంతపు సెలవులు, ఆ తర్వాత ఆయుధపూజ, విజయదశమి సెలవులు కూడా కలిసి రావడంతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు తమ స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ రోజూ నడిపే 2100 బస్సులతోపాటు అదనంగా 744 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక శనివారం కూడా రోజూ నడిపే 2100 బస్సులతోపాటు అదనంగా 938 నడిపారు. ఈ బస్సుల్లో కూడా విపరీతమైన రద్దీ ఏర్పడింది.  బస్‌స్టేషన్లలో ప్రయాణికులను అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. పూందమల్లి బస్‌స్టేషన్‌ నుండి కృష్ణగిరి, హోసూరు, వేలూరు, ఆరణి, తిరుపత్తూరు, ఆర్కాడ్‌, సెయ్యారు, ధర్మపురి, కాంచీపురం, తిరుత్తణి, తిరుపతి, బెంగళూరు, పుదుచ్చేరి తదితర నగరాలకు ప్రత్యేక బస్సులు నడిపారు.

Updated Date - 2022-10-02T13:59:56+05:30 IST