బంగారు తల్లీ..

ABN , First Publish Date - 2022-09-27T06:55:12+05:30 IST

జిల్లావ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని బాలాత్రిపుర సుందరీదేవి, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసిన కోట సత్తెమ్మ ఆలయాలతోపాటు అన్నిచోట్ల అమ్మవారి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. తొలిరోజు ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ బంగారు ఆభరణాలతో అమ్మవార్లను అలంకరించి విశేష పూజలు చేశారు.

బంగారు తల్లీ..
దేవీచౌక్‌లోని బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకుంటున్న రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని

నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం

స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా తొలిరోజు దర్శనం

దేవీచౌక్‌లో ఘనంగా వేడుకలు ప్రారంభం


జిల్లావ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం దేవీచౌక్‌లోని బాలాత్రిపుర సుందరీదేవి, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసిన కోట సత్తెమ్మ ఆలయాలతోపాటు అన్నిచోట్ల అమ్మవారి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. తొలిరోజు ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ బంగారు ఆభరణాలతో అమ్మవార్లను అలంకరించి విశేష పూజలు చేశారు.



రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 26 : రాజమహేంద్ర వరం దేవీచౌక్‌లో ఉన్న బాలాత్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారిని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌ దర్శించుకుని పూజలు చేశారు. అలాగే పెద్దసంఖ్యలో మహిళలు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం వరకు ఈ కుంకుమ పూజలు జరిగాయి. తొలిరోజు బాలాత్రిపుర సుందరీదేవి స్వర్ణకవచ అలంకరణలో ఇక్కడ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బండారులంక వాస్తవ్యులు బళ్ళ మల్లేశ్వరరావు హరికఽథా పురాణం నిర్వహించారు. రాత్రివేళ నంది అవార్డు గ్రహీత ఎం అర్జునరావు సమర్పణలో కనకదుర్గమహత్యం నాటక ప్రదర్శన నిర్వహించారు. అద్భుతమైన సెట్టింగ్‌లు, విద్యుద్దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మంగళవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక నగరంలోని ఇతర చోట్ల అమ్మవారి ఆలయాల్లోనూ పెద్దఎత్తున ఉత్సవాలు ప్రారంభించారు. అనేక కూడళ్లలో దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.   అలాగే భక్తులు దేవీమాల ధరించి దీక్షలు తీసుకున్నారు.


89 ఏళ్లుగా ఉత్సవాలు 

రాజమహేంద్రవరం దేవీచౌక్‌ ప్రాంతంలో గత 89 ఏళ్లుగా బాలాత్రిపుర సుందరీదేవి శరన్నవ రాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అంతకు పూర్వం ఈ సెంటర్‌ నాలుగు లాంతర్ల కూడలి అని పిలిచేవారట. అప్పట్లో బత్తుల వంశస్తులు ఈ నాలుగు లాంతర్ల కూడలిలో బాలాత్రిపుర సుందరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో అప్పటి నుంచి ఈ సెంటర్‌ దేవీచౌక్‌గా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నిర్విరామంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. బత్తుల వంశస్తులతో పాటు ప్రముఖులంతా కలిసి ఆలయ కమిటీ ఏర్పాటుచేసి ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

Updated Date - 2022-09-27T06:55:12+05:30 IST