అన్నదాతను దెబ్బతీసిన అకాల వర్షాలు

ABN , First Publish Date - 2020-04-10T18:37:51+05:30 IST

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను దెబ్బతీశాయి.

అన్నదాతను దెబ్బతీసిన అకాల వర్షాలు

అమరావతి: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను దెబ్బతీశాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంటలు ధ్వంసమయ్యాయి. పరుచూరు, మార్టూరు, దర్శి, వైపాలెం తదితర వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో కల్లాల్లో ఉన్న మిరపకాయలు తడిసిపోయాయి. కొంతమంది మాత్రం టార్పాన్లు కప్పారు. వందలాది ఎకరాల్లో చేతికంది వచ్చిన పంట తడిసిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. వరి, అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి.


గిద్దలూరు, రాచర్ల, కంభం, కొమరోల్లో ఒక్కరోజు కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ఈదురుగాలుల ఉధృతికి పలుచోట్ల చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. భారీ వర్షాలకు డ్రైనేజ్‌లు సయితం పొంగి రోడ్డుపైకి ప్రవహించడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. కడపజిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, కడప నియోజకవర్గాల్లో 2,663 హెక్టార్లలో అరటి, బొబ్బాయి, మామిడి, తమలపాకు, మునగ పంటలు దెబ్బతిన్నాయి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో తోటలోనే మాగిపోతున్న అరటి గెలలు నెలకొరిగిపోయాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Updated Date - 2020-04-10T18:37:51+05:30 IST