హెలికాప్టర్లో కోడలిని ఇంటికి తీసుకొచ్చిన దళిత కుటుంబం!
ABN , First Publish Date - 2021-12-17T02:59:04+05:30 IST
దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతున్న వేళ.. దళిత పెళ్లికొడుకులు గుర్రం ఎక్కితేనే ఓర్వలేక దాడులు జరుగుతున్న..
జైసల్మేర్: దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతున్న వేళ.. దళిత పెళ్లికొడుకులు గుర్రం ఎక్కితేనే ఓర్వలేక దాడులు జరుగుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్లో బార్మర్ జిల్లాలో అద్భుతం జరిగింది. ఓ దళిత కుటుంబం తన కోడలిని ఏకంగా ప్రైవేటు హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చింది. అయితే, అదేమీ అంత సులభంగా జరగలేదు. కోడలిని మెట్టినింటికి తీసుకొచ్చేందుకు అద్దెకు తీసుకున్న చాపర్ చివరి నిమిషంలో హ్యాండించింది.
దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ కుటుంబం మరో లక్షరూపాయలు అదనంగా వెచ్చించి మరో హెలికాప్టర్ను అద్దెకు తీసుకుంది. పుట్టింటి నుంచి తొలిసారి తమ ఇంట్లో అడుగుపెట్టబోతున్న కోడలిని హెలికాప్టర్లో తీసుకురావాలన్నది వరుడి తండ్రి కోరిక. కాబట్టి డబ్బుకు వెనకాడకుండా హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నారు.
దళిత యువకుడు తరుణ్ మేఘ్వాల్కు దియాతో పాకిస్థాన్ సరిహద్దు బార్మర్కు సమీపంలోని పట్టణంలో వివాహం జరిగింది. ఆ తర్వాతి రోజు వధూవరులిద్దరూ హెలికాప్టర్లో జసేధార్ ధామ్కు చేరుకున్నారు. గ్రామంలో హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండడాన్ని గమనించిన గ్రామస్థులు ఆ ప్రాంతానికి పోటెత్తారు. దీంతో వారిని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. జనం పెద్ద ఎత్తున గుమికూడడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కష్టమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు హెలికాప్టర్ ల్యాండ్ అయింది.