దళితబంధును సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2021-12-03T05:58:17+05:30 IST
దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.
అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్
హుజూరాబాద్, డిసెంబరు 2: దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ అధ్యక్షతన దళితబంధు ట్రాన్స్పోర్ట్ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,198 మంది లబ్ధిదారుల్లో 6,800 వాహనాల లబ్ధిదారులుగా ఎంపికయ్యారన్నారు. పథకాన్ని మార్చుకునే అవకాశం ఉందన్నారు. లబ్ధిదారులకు లైసెన్స్లు ఉన్నాయా, లేదా అని అడిగి తెలుసు కున్నారు. వాహనాలు నడపరాని లబ్ధిదారులకు 30 రోజుల పాటు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి లైసెన్స్ అందజే స్తామన్నారు. ఈ పథకాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్రెడ్డి, తహసీల్దార్ రాంరెడ్డి, హుజూరాబాద్ మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సిరాజ్ ఉర్ రహ్మన్ పాల్గొన్నారు.
మహిళలు, కిశోర బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలి
మానకొండూర్: మహిళలు, కిశోర బాలికలకు తప్పకుండా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అదేశించారు. అనీమియా ముక్త్ కరీంనగర్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని వివిద గ్రామాల్లో 14 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ మహిళలందరికి హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలన్నారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో డిసెంబరు చివరి వరకు వ్యాక్సినేషన్ 100 శాతంపూర్తి చేయాలని సూచించారు. ఎనిమిది సబ్సెంటర్లలో ప్రభుత్వ ఉద్యోగినులకు టెస్టులు చేసి, గ్రామాలలో వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో జువైరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సీడీపీవో సబిత, ఎంపీడీవో దివ్యదర్శన్రావు, పీహెచ్సీ వైద్యాధికారి సంధ్యారాణి, స్వఛ్చ భారత్ ప్రోగ్రాం అధికారి కిషన్, రాజ్నాయక్, సిబ్బంది ఉన్నారు.