తల్లీబిడ్ద మృతితో భగ్గుమన్న దళిత సంఘాలు

ABN , First Publish Date - 2020-05-26T08:44:00+05:30 IST

పేరుకే అది ఏరియా పెద్దాసుపత్రి. అరకొర వైద్యసేవలతో అబాసుపాలవుతూనే ఉంది.

తల్లీబిడ్ద మృతితో భగ్గుమన్న దళిత సంఘాలు

 మైలవరం, మే 25 : పేరుకే అది ఏరియా పెద్దాసుపత్రి. అరకొర వైద్యసేవలతో అబాసుపాలవుతూనే ఉంది. సరైన వైద్యసేవలు సకాలంలో అందక వైద్యం కోసం వచ్చే అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తునే ఉన్నాయి. అయినా పాలకులు, అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాన్పు కోసం వచ్చిన బాలింతతో పాటు బిడ్డ కూడా మృతి చెందడంతో మరో మారు మైలవరం ప్రభుత్వాసుపత్రి డొల్లతనం, వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రోగుల పట్ల వైద్యుల నిర్లక్యానికి పలువురి అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఎమ్మార్పీఎస్‌ నేతలు సోమవారం ధర్నాకు దిగారు. మైలవరం మండలం జంగాలపల్లికి చెందిన కంభంపాటి కుసుమ (29) అనే గర్భవతి మైల వరం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది.


కాన్పు అనంతరం తల్లిబిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యురాలు శిరీష వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. మార్గ మధ్య లోనే శిశువు మృతి చెందాడు. కుసుమను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఈనెల 22న మృతి చెందింది. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మార్పీఎస్‌ నేతల సాయంతో మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లి బిడ్డ మృతి చెందారని వారు ఆరోపించారు. గతంలోను కాన్పు కోసం వచ్చిన వలస కూలికి వైద్యం చేయకుండా పంపివేయడంతో నడి రోడ్డు మీద ఆమె ప్రసవించింది. ఇలాంటి ఘటనలు అనేకం వైద్యుల నిర్లక్ష్యం, వసతుల లేమి వల్ల జరు గుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, పాలకులు ఈ ఆసుపత్రి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి అమాయకులు ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.  


Updated Date - 2020-05-26T08:44:00+05:30 IST