రోడ్డు మీద తిరుగుతున్న వివాహిత.. అనుమానంతో పోలీసులకు ఫోన్ చేయగా..

ABN , First Publish Date - 2020-08-11T18:33:18+05:30 IST

అసలే ఆమె అనాథ. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులు..

రోడ్డు మీద తిరుగుతున్న వివాహిత.. అనుమానంతో పోలీసులకు ఫోన్ చేయగా..

మహిళను కాపాడిన పోలీసులు

డయల్‌-100తో వివాహిత ఆత్మహత్యను నిలువరించిన వైనం


అనంతపురం(ఆంధ్రజ్యోతి): అసలే ఆమె అనాథ. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువులు నాలుగేళ్ల  క్రితం నగరానికి చెందిన ఓ యువకుడికిచ్చి వివాహం చేశారు. మొదట్లో బాగా చూసుకున్నారు. కొంతకాలంగా అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి. అవి అధికమవటంతో తీవ్ర మనస్తాపం చెంది, చనిపోవాలని నిర్ణయించుకుని వెళ్తున్న బాధిత మహిళను పోలీసులు సురక్షితంగా కాపాడి, అండగా నిలిచారు.


శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన నవనీతకు నాలుగేళ్ల క్రితం నగరంలోని రాంనగర్‌కు చెందిన అశ్వత్థ అనే యువకుడితో వివాహమైంది. వీరికి మూడేళ్ల చిన్నారి ఉంది. కొంతకాలంగా  భర్తతోపాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. సోమవారం కూడా అత్తమామలు తీవ్రస్థాయిలో మందలించటంతో మనస్తాపం చెంది, చనిపోవాలని నిర్ణయించుకుని నగర శివారులోని రవి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో జాతీయ రహదారిపైకి ఒంటిరిగా వచ్చేసింది నవనీత. ఏదైనా వాహనం కింద పడి, ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుండగా.. స్థానికులకు అనుమానం వచ్చి డయల్‌-100కు ఫోన్‌ చేశారు. తక్షణమే నాలుగో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు.. సిబ్బందితో హుటాహూటిన అక్కడికి చేరుకుని, ఆమె ఆత్మహత్యను నిలువరించారు. ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి, భర్త, అత్తమామలకు స్టేషన్‌లో కౌన్సిలింగ్‌ చేసి, సర్దిచెప్పి పంపించారు.


Updated Date - 2020-08-11T18:33:18+05:30 IST