‘సైబర్ నేరగాళ్ల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి’
ABN , First Publish Date - 2020-08-07T22:15:40+05:30 IST
ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెజవాడ పోలీసులు సూచిస్తున్నారు.
విజయవాడ: ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెజవాడ పోలీసులు సూచిస్తున్నారు. ఆన్లైన్ కోర్సుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించలేదని, కొన్ని విద్యా వ్యాపార సంస్థలు దీనిని అనుకూలంగా మార్చుకుని ఇంటరాక్ట్ కోర్సులు, వీడియో లెర్నింగ్, వంటి రకరకాల పద్దతులతో కోర్సులను ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. ఇటువంటి వాటిని సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుని ప్రముఖ కంపెనీ ప్రకటనలు తయారు చేస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి పలు కోర్సులు నేర్పిస్తామంటూ డబ్బులు దండుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అనుమానం ఉన్నా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.