సైబర్ నేరాలను నియంత్రించాలి
ABN , First Publish Date - 2022-05-19T05:55:47+05:30 IST
సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలని డీజీపీ ఎం మహేందర్ అన్నారు.
- డీజీపీ మహేందర్రెడ్డి
కరీంనగర్ క్రైం, మే 18: సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పనిచేయాలని డీజీపీ ఎం మహేందర్ అన్నారు. సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన చర్యలు, ఐటీ ఇండస్ర్టీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ, సెక్యూరిటీ కోసం కాన్సెప్ట్ ప్రెజెంటేషన్పై బుధవారం పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల ఆవశ్యకత చాలా ఉన్నదని అన్నారు. ఇందుకోసం పోలీసుశాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి పోలీస్ స్టేషన్లలో ఇద్దరిని సైబర్ వారియర్గా నియమించిందన్నారు. ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ సిరీస్ 3.0 పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరిచారని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది పెరిగే సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, టెక్నాలజీపై మంచి పట్టు సాధించాలని సూచించారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర సీనియర్ పోలీసు అధికారుల నుంచి సైబర్ నేరాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో సీపీ వి సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్, ఏసీపీలు పి కాశయ్య, టి సత్యనారాయణ, కమ్యూనికేషన్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐ మురళి పాల్గొన్నారు.