ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..
ABN , First Publish Date - 2020-10-18T14:32:45+05:30 IST
ఉద్యోగాలంటూ డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాడిని సైబర్ క్రైం సిబ్బంది అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన సచిన్యాదవ్ ఆన్లైన్ సైట్లలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారి వివరాలు సేకరిస్తాడు. అనంతరం వారికి ఫోన్ చేసి, ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం వచ్చిందని నమ్మించేవాడు.
హైదరాబాద్ : ఉద్యోగాలంటూ డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాడిని సైబర్ క్రైం సిబ్బంది అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన సచిన్యాదవ్ ఆన్లైన్ సైట్లలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారి వివరాలు సేకరిస్తాడు. అనంతరం వారికి ఫోన్ చేసి, ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం వచ్చిందని నమ్మించేవాడు. ఉద్యోగంలో చేరాలంటే సెక్యూరిటీ డిపాజిట్, రిఫండబుల్ డిపాజిట్ తదితర పేర్లతో అందిన కాడికి దోచేస్తాడు. అలా నగరవాసి నుంచి ఉద్యోగం పేరుతో పలు దఫాలుగా రూ.96,563 ఆన్లైన్లో బదిలీ చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని గుర్తించారు. ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి ఒక ల్యాప్టాప్, 8 సెల్ఫోన్లు, 2 రూటర్లు, 2 డెబిట్ కార్డులు, 6 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్పై నగరానికి తరలించారు.