లాక్డౌన్లో సైబర్ వల
ABN , First Publish Date - 2021-05-19T07:32:20+05:30 IST
ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన రమేశ్కు
మల్టీ లెవల్ మోసాల జోరు
ఇంట్లోనే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చునని..
నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన రమేశ్కు ‘ప్రస్తుతం కొత్త యాప్స్కు మార్కెట్లో డిమాండ్ ఉంది. మేం పంపిన లింక్ను క్లిక్ చేసి, యాప్లో పెట్టుబడి పెడితే ప్రతి వారం లాభాలు పొందవచ్చు’ అని ఓ మెసేజ్ వచ్చింది. కాంటాక్టు నంబర్ కూడా ఇచ్చారు. దాంతో రమేష్ లింక్ ఓపెన్ చేసి, తన వివరాలు నమోదు చేశారు. అంతే సైబర్ నేరగాళ్లు లైన్లోకి వచ్చారు. పెట్టుబడి కోసమంటూ డబ్బులు జమ చేయాల్సిన ఖాతా నంబర్లు ఇచ్చారు. యూసర్ ఐడీ పాస్వర్డ్ ఇచ్చారు. పెట్టుబడి లాభనష్టాలు చూసుకోవచ్చునని చెప్పారు. మొదటిసారి అనుమానించిన రమేష్ ఎందుకైనా మంచిదని కేలం రూ. 1000 మాత్రమే డబ్బు జమ చేశాడు. వారం రోజుల్లో ఖాతాలో రూ. 3 వేలు జయ అయ్యాయి. దీంతో రమేశ్ రూ. 5 వేలు జమ చేశాడు. వారం తర్వాత రూ. 12 వేలు జమ అయ్యాయి. రమే్షను గమనిస్తున్న సైబర్ నేరగాళ్లు మరోసారి లైన్లోకి వచ్చారు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడితే, రూ. లక్షలు వస్తాయని నమ్మించారు. ఇలాంటి అవకాశం తక్కువ సార్లు వస్తుందని నమ్మించారు. అప్పటికే వారి బుట్టలో పడిన రమేశ్ ఏకంగా రూ. 6 లక్షలు జమ చేశారు. వారం తర్వాత ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఆన్లైన్లో చెక్ చేయగా అదే పరిస్థితి. దాంతో నిర్వాహకులకు ఫోన్ చేయగా ‘నీతో పాటు మరో ఐదుగురిని ఇందులో చేర్పించాలని, వారితో పెట్టుబడి పెట్టించాలని, అప్పుడే మీకు లాభాలతో పాటు కమీషన్ కూడా ఇస్తాం’ అన్నారు. దాంతో రమేష్ షాకయ్యాడు. దీంతో రమేష్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఇదంతా ఢిల్లీకి చెందిన సైబర్ ముఠా పనిగా గుర్తించారు.
ఫ కూకట్పల్లికి చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సుమారు 10 మంది యాప్స్లో పెట్టుబడి పేరుతో ఇలాంటి సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి రూ. 15లక్షల వరకు మోసపోయినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో సైబర్ నేరగాళ్ల ముఠాను గుర్తించే పనిలో ఉన్నారు.
లాక్డౌన్లను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. లాక్డౌన్ వల్ల పని లేక ఇబ్బందులు పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ యాప్స్లో పెట్టుబడి పెడితే ఇంటి నుంచే ఎలాంటి రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించవచ్చు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఈజీమనీకి అలవాటుపడిన కొందరు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. ముందుగా లాభాలు వచ్చినట్లు చూపించి, ఆ తర్వాత లక్షల్లో కొల్లగొడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చస్తున్నారు.