కొత్త ప్రాజెక్టులు కట్టొద్దు

ABN , First Publish Date - 2020-05-31T07:24:08+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం కొత్త మలుపు తిరిగింది. కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల విషయమై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న...

కొత్త ప్రాజెక్టులు కట్టొద్దు

సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరి

పరిశీలనల తర్వాతే ముందుకెళ్లాలి

ఇరు రాష్ట్రాలకు కృష్ణా, గోదావరి బోర్డుల ఆదేశం

4న కృష్ణా, 5న గోదావరి బోర్డు సమావేశాలు


హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం కొత్త మలుపు తిరిగింది. కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల విషయమై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు కృష్ణా, గోదావరి బోర్డులు శనివారం కీలక ఆదేశాలు జారీ చేశాయి. అన్ని అనుమతులు, పరిశీలనలు పూర్తయ్యే వరకూ కృష్ణా, గోదావరి నదులపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించాయి. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలన, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందే వరకూ ముందుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశాయి. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బోర్డు శనివారం వేర్వేరుగా లేఖలు రాశాయి. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నెల 14న ఏపీ ప్రభుత్వం కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసింది. పునర్విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించింది. అలాగే, కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203పై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాశాయి. వీటిపై స్పందించిన ఆ శాఖ.. అభ్యంతరాలను పరిశీలించాలని ఆయా బోర్డులకు సూచించింది. ఇందులోభాగంగానే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆయా బోర్డులు వేర్వేరుగా లేఖలు రాశాయి.


కృష్ణా బోర్డు సమావేశాన్ని 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు  లేఖలు రాశారు. హైదరాబాద్‌ జలసౌధలో ఈ సమావేశం జరగనుంది. కాగా, సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండాను పంపించాలని రెండు రాష్ట్రాలకూ బోర్డు సూచించినా.. ఏ రాష్ట్రమూ పంపలేదు.  ఏపీ చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే, జూన్‌ 5వ తేదీన గోదావరి బోర్డు సమావేశం నిర్వహించనున్నట్లు బోర్డు సభ్యుడు బీపీ పాండే ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. 

Updated Date - 2020-05-31T07:24:08+05:30 IST