కట్.. కాపీ.. పేస్ట్తో విసుగెత్తిపోయాం
ABN , First Publish Date - 2021-03-06T08:15:08+05:30 IST
హైకోర్టుల ఆర్డర్లలో కనిపించే కట్.. కాపీ.. పేస్ట్ వ్యవహారంతో విసుగెత్తిపోయాం. కింది కోర్టులు ఇస్తున్న ఆర్డర్లను యథాతథంగా అనుకరిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి’’ అని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. ఒడిసా హైకోర్టు
హైకోర్టుల ఆర్డర్లపై తీవ్రంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మార్చి 5: ‘‘హైకోర్టుల ఆర్డర్లలో కనిపించే కట్.. కాపీ.. పేస్ట్ వ్యవహారంతో విసుగెత్తిపోయాం. కింది కోర్టులు ఇస్తున్న ఆర్డర్లను యథాతథంగా అనుకరిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి’’ అని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది. ఒడిసా హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పుపై.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) చేసిన అప్పీల్పై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బిభు ప్రసాద్ సారంగి అనే ఒడిసా రాష్ట్ర సర్వీసుల ఉద్యోగి ఒకరు.. సీనియారిటీ ప్రకారం తనకు ఐఏఎస్ హోదా కల్పించడం లేదంటూ యూపీఎస్సీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. క్యాట్లో సారంగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పీల్కు వెళ్తే.. హైకోర్టు కూడా క్యాట్ తీర్పును సమర్థించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘క్యాట్ తీర్పును అచ్చు గుద్దినట్లు హైకోర్టు తీర్పులో దించేశారు. చాలా హైకోర్టులు ఇదే చేస్తున్నాయి. ఇది సరికాదు. సొంతంగా మెదడును ఉపయోగించాలి. ఆర్డర్లలో విశ్లేషణ ఉండాలి’’ అని సుప్రీం వ్యాఖ్యానించిది. ఒడిసా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది.