Tukaram temple: వివాదం సృష్టించిన మోదీ తలపాగా
ABN , First Publish Date - 2022-06-14T20:06:03+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన తలపాగా (Turban) వివాదానికి తావిచ్చింది. మహారాష్ట్రలోని పుణెలో ..
పుణె: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన తలపాగా (Turban) వివాదానికి తావిచ్చింది. మహారాష్ట్రలోని పుణెలో ప్రఖ్యాత సంత్ తుకారాం మహరాజ్ (Sant Tukaram Maharaj) ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నందున ఆ సమయంలో ఆయన ధరించేందుకు ఈ టర్బన్ను రూపొందించారు. తుకారాం అభంగాలలోని కొన్ని పదాలను తలపాగాపై ముద్రించారు. అయితే, ఈ పదాలను మార్చాలంటూ దేహు సంస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పుణెలోని మురుద్కర్ ఝెండేలావా దుకాణ యజమాని ఈ ప్రత్యేక తలపాగాను డిజైన్ చేశారు. దెహు టెంపుల్ ఆదేశాల మేరకు తలపాగాను ఆయన డిజైన్ చేశారు. అయితే, దానిపై (టర్బన్) రాసిన రాతల పట్ల సంస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
''ఎవరి ప్రవర్తన మంచిగా ఉంటుందో వారికి మంచి జరుగుతుంది. దుష్ట తలంపు ఉంటే అందుకు తగ్గట్టే ఫలితం ఉంటుంది'' అని ఆ టర్బన్పై రాసి డిజైన్ చేశారు.ఈ రాతలను వెంటనే మార్చాలని దేహు సంస్థాన్ అధ్యక్షుడు నితిన్ మహరాజ్ ఆదేశించారు. దాంతో ''విష్ణుమయ్ జగ్ వైష్ణవాంచ ధర్మ, భేదాభేద్ ధర్మ అమంగళ్'' అంటూ ఆ రాతలను సవరించి తిరిగి తలపాగాను డిజైన్ చేయడంతో వివాదానికి తెరపడింది.
మహారాష్ట్రలో ఒకరోజు పర్యటనకు ప్రధాని మోదీ వచ్చారు. ఇందులో భాగంగా దేహులోని 17వ శతాబ్దానికి చెందిన సంత్ తుకారాం మహరాజ్ పేరిట ఒక ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ముంబై సమాచార్ పత్రిక ద్విశాబ్ది మహోత్సవ్ (200 సంవత్సరాలు)లో పాల్గోనున్నారు.