ముఖంపై ఉమ్మి, తిండి విసిరేసి.. Zomato delivery manపై కులోన్మాద దాడి

ABN , First Publish Date - 2022-06-20T20:39:40+05:30 IST

శనివారం సాయంత్రం లఖ్‌నవూలోని ఓ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లాను. లొకేషన్‌కు చేరుకున్నాక.. ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తులు నా పేరు, కులం అడిగారు. నా పేరు, కులం చెప్పాను. అంతే అంటరాని వ్యక్తి తెచ్చిన తిండి తీసుకోమని పడేసి, నన్ను కులం పేరుతో తిట్టడం ప్రారంభించారు. అవసరం లేకుండా ఆర్టర్ క్యాన్సిల్ చేయమని వారిని కోరాను..

ముఖంపై ఉమ్మి, తిండి విసిరేసి.. Zomato delivery manపై కులోన్మాద దాడి

లఖ్‌నవూ: భారతదేశంలో కులం ప్రాధాన్యత, కులం పేరుతో జరిగిన జరుగుతున్న వివక్ష, దారుణాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ సమానమనే శాసనం వచ్చి ఏడు దశాబ్దాలు ముగిసింది. అంతరిక్షంలో అద్భుతాలకు కొదవే లేదు. మనసులో అనుకున్నా కళ్లముందుకు వచ్చేంత టెక్నాలజీ పెరిగింది. కానీ దేశంలోని కుల వివక్ష మాత్రం పోవడం లేదు. అసాంఘీకమైన ఈ దురాచారం కారణంగా దేశంలో సామాజిక వెనుకబడిన వారిపై దాడులు, అవమానాలు కొన్నిసార్లైతే ప్రాణాలు పోయేంత ఉన్మాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి.


తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జొమాటో ఫుడ్ డెలివరీ వ్యక్తిపై జరిగిన దాడి.. మన దేశ మూలాల్లో కులోన్మాదం ఎంత బలంగా వేళ్లూనుకుని ఉందో స్పష్టం చేస్తుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్‌కు చెందిన ఒక వ్యక్తి ఫుడ్ డెలివరీ తెచ్చాడని, తిండి మైలపడిందని పడేశారు. డెలివరీ వ్యక్తిపై ఉమ్ముతూ, కులం పేరుతో బూతుడు తిడుతూ, విపరీతంగా కొట్టారు. అతడి ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో బైక్ వెనక్కి ఇచ్చారు, అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.


నాలుగేళ్లుగా జొమాటో డెలివరీ మ్యాన్‌గా పని చేస్తున్న వినీత్ కుమార్ అనే వ్యక్తి తనకు ఎదురైనా ఈ దారుణ ఘటనపై స్పందిస్తూ.. ‘‘శనివారం సాయంత్రం లఖ్‌నవూలోని ఓ ప్రాంతంలో ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లాను. లొకేషన్‌కు చేరుకున్నాక.. ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తులు నా పేరు, కులం అడిగారు. నా పేరు, కులం చెప్పాను. అంతే అంటరాని వ్యక్తి తెచ్చిన తిండి తీసుకోమని పడేసి, నన్ను కులం పేరుతో తిట్టడం ప్రారంభించారు. అవసరం లేకుండా ఆర్టర్ క్యాన్సిల్ చేయమని వారిని కోరాను. కానీ వాళ్లు వినకుండా నా ముఖంపై ఉమ్మారు. మరికొంత మందిని పిలిచి భౌతిక దాడికి దిగారు’’ అని వినీత్ వాపోయాడు.


‘‘వాళ్లు నా బండి లాక్కున్నారు. నేను పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేశాను. పోలీసులు ఘటనా ప్రదేశంలోకి వచ్చి నా బండి ఇప్పించారు’’ అని వినీత్ తెలిపాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఈస్ట్ జోన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అడిషనల్ కమిషనర్ ఆప్ పోలీస్ ఖాసిం అబిది తెలిపారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-06-20T20:39:40+05:30 IST