మేఘాలకే కరెంట్ షాకిచ్చారు… ఎందుకంటే…
ABN , First Publish Date - 2021-07-22T23:58:22+05:30 IST
అక్కడ మేఘాలకు కరెంట్ షాకిచ్చారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కానీ... అంత తేలికగా నమ్మలేం కదూ.
జెడ్డా : అక్కడ మేఘాలకు కరెంట్ షాకిచ్చారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కానీ... అంత తేలికగా నమ్మలేం కదూ. అది సరే... ఇంతకీ... మేఘాలకు కరెంట్ షాక్ ఎందుకిచ్చారన్నది తెలుసుకుంటే ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక కథనం చదవండి. గల్ఫ్ దేశాల్లో వేడి అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. సాధారణ రోజుల్లోనే ఉదయం సమయాల్లో ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఏసీలు వేసుకున్నా అంత వేడిని తట్టుకోవడం కష్టమే. అందుకే చాలామంది ఇంటి నుంచి బయటకు రావడానికి సందేహిస్తుంటారు.
ఇక ఏయేటికాయేడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండడంతో... వేడిని తగ్గించే యత్నాల్లో భాగంగా... కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు దుబాయ్ వాతావరణ శాఖ ఓ వినూత్నమైన ప్రయోగం చేసింది. ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్లను మేఘాల్లోకి పంపి... విద్యుత్తు షాకిచ్చేలా ఏర్పాటు చేశారు. ఇలా డ్రోన్ల సహాయంతో మేఘాలకు విద్యుత్తు షాక్ ఇవ్వడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి మేఘావృతమై వర్షం కురిసింది. ఉన్నట్టుండి హటాత్తుగా వర్షం కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోను దుబాయ్ వాతావరణ శాఖ పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. వర్షాలు అేక అల్లాడే ప్రాంతాల్లో ఈ ప్రయోగాన్ని చేస్తే బాగుంటుంది కదా అన్న వ్యాఖ్యానాలు ఇప్పుడు తారస్థాయిలో వినిపిస్తున్నాయి.