సాంస్కృతిక కార్యక్రమాలకు మమత గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2020-10-13T05:30:00+05:30 IST
దుర్గా పూజ నేపథ్యంలో 150 మంది వరకు పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు..
కోల్కతా: దుర్గా పూజ నేపథ్యంలో 150 మంది వరకు పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ కార్యక్రమాలు జరిగే స్థలం విశాలంగా ఉంటే 200 మంది వరకు పెంచవచ్చునని ఆమె పేర్కొన్నారు. సచివాలయం ‘‘నబన్నా’’ వద్ద జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం మమత పాల్గొని ప్రసంగించారు. కరోనా వైరస్ తీవ్ర స్థాయికి చేరుకున్నందున ప్రజలు కొవిడ్-19 నిబంధనలన్నీ తప్పక పాటించాలని సూచించారు. ‘‘హాళ్లు, ఓపెన్ ప్రదేశాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో 100 మంది వరకు పాల్గొనేందుకు అనుమతించాం. మీకు విశాలమైన స్థలం దొరికితే ఈ సంఖ్యను 200 వరకు పెంచుకోవచ్చు. అయితే అటువంటి కార్యక్రమాలను పూజా మండపాల దగ్గర మాత్రం నిర్వహించొద్దు. జనాలను నియంత్రించడం అటు పోలీసులకు గానీ, ఇటు మండపాల నిర్వాహకులకు గానీ కష్టం అవుతుంది..’’ అని సీఎం మమత సూచించారు.