బీర్భూమ్ హింసాకాండపై కలకత్తా హైకోర్టు స్వీయ విచారణ

ABN , First Publish Date - 2022-03-23T18:30:16+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో చెలరేగిన

బీర్భూమ్ హింసాకాండపై కలకత్తా హైకోర్టు స్వీయ విచారణ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై కలకత్తా హైకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. దుండగులు దాదాపు 12 ఇళ్ళను తగులబెట్టి, బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటిలో నివసిస్తున్నవారిని నిర్బంధించి, ఆ ఇంటిని తగులబెట్టడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 


ఈ హింసాకాండపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణను ప్రారంభిస్తుంది. 


రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ నేత ఒకరు హత్యకు గురైన నేపథ్యంలో ఈ హింసాకాండ చెలరేగింది. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ (సీఐడీ) జ్ఞానవంత్ సింగ్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. 


రాంపూర్‌హట్ పట్టణానికి సమీపంలో ఉన్న బోగ్టుయి గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. బాంబు పేలుళ్ళు జరగడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వ్యాపిస్తుండగా, వాటిని ఆర్పేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందజేశారు. 


ఈ సంఘటనపై సవివరమైన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. బీజేపీ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను న్యూఢిల్లీలో కలిసి, ఈ హింసాకాండకు బాధ్యులను శిక్షించాలని కోరింది. 


ఈ సంఘటనా స్థలంలో పర్యటించి, వాస్తవాలను తెలుసుకునేందుకు ఐదుగురు సభ్యులతో ఓ బృందాన్ని  బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-03-23T18:30:16+05:30 IST