బదిలీల.. బహిష్కరణ
ABN , First Publish Date - 2022-07-13T05:18:18+05:30 IST
వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అస్తవ్యస్తంగా రూపొందించిన సర్కిల్స్ పునర్వవ్యస్థీకరణ, పారదర్శకత లేని బదిలీలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ గుంటూరు-1, 2 డివిజన్ నేతలు ప్రకటించారు.
సీటీ శాఖ ఉద్యోగుల ఆందోళన బాట
పారదర్శకత లేని బదిలీలపై నిరసన
నేటి నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు
గుంటూరు, జూలై 12: వాణిజ్యపన్నులశాఖ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. అస్తవ్యస్తంగా రూపొందించిన సర్కిల్స్ పునర్వవ్యస్థీకరణ, పారదర్శకత లేని బదిలీలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాణిజ్యపన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ గుంటూరు-1, 2 డివిజన్ నేతలు ప్రకటించారు. ఈ మేరకు బుదవారం నుంచి జిల్లాలో ఆందోళన బాట పడుతున్నట్లు తెలిపారు. విజయవాడలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. బుధవారం నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 19, 20వ తేదీల్లో కార్యాలయాల ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలానే 22వ తేదీన విజయవాడలోని చీఫ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఽపెద్దఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ గుంటూరు-2 డివిజన్ అధ్యక్షుడు ఎం.కిషోర్కుమార్, కార్యదర్శి ఏఎస్ సోమశేఖరరావులు తెలిపారు. కాగా పారదర్శకత లేని బదిలీలతో ఉద్యోగుల్లో అయోమయానికి దారితీస్తుందన్నారు. బదిలీలను కౌన్సెలింగ్ విధానంలో నిర్వహించాలని, స్టేషన్ ప్రాతిపదిక కాకుండా ఆఫీస్ ప్రాతిపదికను నిర్వహించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో బదిలీల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ సీటీ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు ఆందోళన బాట పట్టటంతో ఆ శాఖ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బదిలీలు సజావుగా సకాలంలో జరుగుతాయా లేక వాయిదా పడతాయా అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. కాగా బదిలీల ప్రక్రియకు ది సీటీఎన్జీవో అసోసియేషన్ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నట్లు గుంటూరు-2 డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ జానీబాషా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకుల బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. కొన్ని ఒడిదుడుకులు, అభ్యంతరాలు ఉన్నంత మాత్రాన బదిలీలను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర కమిటీ తీర్మానించినట్లు తెలిపారు.