ప్రభుత్వం కల్పించే సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలి:సీఎస్

ABN , First Publish Date - 2021-08-26T20:08:34+05:30 IST

ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పించే సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలి:సీఎస్

హైదరాబాద్: ప్రభుత్వం కల్పించే సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేకించి కోవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకుని కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. చంద్రాయణ గుట్టలోని ఉప్పుగూడలో, పరివార్ టౌన్ షిప్ లో వ్యాక్సినేషన్ సెంటర్ ను సోమేశ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, ప్రజా ప్రతినిధులు ప్రజలు కూడా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేలా వారిని చైతన్యం చేయాలన్నారు.తద్వరా నగరాన్ని 100 శాతం వ్యాక్సినేటేడ్ నగరంగా తయారుచేయాలన్నారు.


ఈ ప్రాంతంలో వ్యాక్సినేషన్ జరుగుతున్నతీరును అధికారులతో ఎంక్వైరీ చేశారు. డోర్ టు డోర్ సర్వేను పూర్తిచేశామని, వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించామని అధికారులు సీఎస్ కి వివరించారు. ఈ ప్రాంతంలో నెలాఖరులోగా 100 శాతం వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని స్ధానిక ప్రతినిధులు సీఎస్ కు  హామీ ఇచ్చారు. అర్హులైన ప్రజలందరికి మొదటి విడత వ్యాక్సినేషన్ జరిగేలా జిహెచ్ఎంసి  ఏరియా వైద్యఆరోగ్య శాఖ 100 శాతం వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ మాప్ అప్ డ్రైవ్ ను చేపట్టింది. కాలనీల వారిగా  విధానాన్ని  రూపొందించి డోర్ టు డోర్ సర్వేతో పాటు వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో 585 కాలనీలల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయింది.  47,104 మందికి మొదటి విడత, 7304 మందికి రెండవ విడత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని అధికారులు వివరించారు. జిహెచ్ఎంసి నుండి 4182 మంది సిబ్బందిని, వైద్యశాఖ 1639 మంది సిబ్బందిని రంగంలోని దించడం జరిగింది. కాలనీల స్ధాయిలో మొబైల్ వ్యాక్సినేషన్ కోసం 594 వాహనాలను వినియోగించడమైనది.ఈ పర్యటనలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్,  హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-26T20:08:34+05:30 IST