యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయండి: సీఎస్

ABN , First Publish Date - 2022-04-13T22:03:17+05:30 IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయండి: సీఎస్

హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈమేరకు ఆయన బుధవారం  జిల్లా కలెక్టర్లతోటెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై  జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్లో ఆయన సమీక్షించారు. జిల్లాలలో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. అన్నిజిల్లాలలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం  చేయాలని, ఆయా జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని ఆదేశించారు. 


రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని పేర్కొన్నారు. గత ఖరీఫ్ (వానాకాలం) లో ఏర్పాటు చేసినన్ని కొనుగోలు కేంద్రాలు గానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని, ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సారించాలని. దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలని, ప్రతి క్వింటాల్ ధాన్యంకు రూ.1960 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, ఆదే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 


జిల్లాలలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏవిధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలను జిల్లాల వారిగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన ఆదేశించారు.జిల్లాలో వరి పంట కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయని. వాటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని, పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని. దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-13T22:03:17+05:30 IST