నాయీబ్రాహ్మణ, రజకులకు ఉచిత విద్యత్ పై సీఎస్ సమావేశం

ABN , First Publish Date - 2021-07-29T20:20:19+05:30 IST

తెలంగాణలో నాయీబ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ పధకం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం

నాయీబ్రాహ్మణ, రజకులకు ఉచిత విద్యత్ పై సీఎస్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణలో నాయీబ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ పధకం పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు,సీఎస్ సోమేశ్ కుమార్ ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది ధరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి అధికారులు స్వీకరించారు. ఈ పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదుచేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బిసి సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని ఆదేశించారు. 


లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటి అధికారులను ఆదేశించారు. సిజిజి లో రిజిష్ట్రరు చేసుకున్న ధరఖాస్తులను  సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత డిస్కమ్ లకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఏప్రిల్ 4వ తేదీన జివో. ఎంస్. నెం. 2ను  బిసి వెల్పేర్ (డి) డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేసింది. దాంతో పాటు నియమనిబంధనలు  కూడ విడుదల చేసింది.


ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, బిసి వెల్ఫేర్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, టీఎస్ఎస్ డిసిఎల్ సీఎండి రఘుమారెడ్డి, బిసి వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, వాషర్ మెన్ ఎండి చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ్ ఎంసి విమల మరియు తదతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T20:20:19+05:30 IST