దేశ భూ పరిపాలనా రంగంలోనే అతిపెద్ద సంస్కరణ ధరణి - సీఎస్

ABN , First Publish Date - 2021-10-29T22:34:56+05:30 IST

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పాలనా రంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.

దేశ భూ పరిపాలనా రంగంలోనే అతిపెద్ద సంస్కరణ ధరణి - సీఎస్

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర పాలనా రంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణ ధరణి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ధరణి కార్యక్రమం ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్బంగా బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నేడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వివిధ శాఖల సీనియర్ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా, ధరణి ఒక సంవత్సర కాలంలో సాధించిన విజయాలను తెలిపే ప్రత్యేక బుక్ లెట్ ను సీఎస్ సోమేశ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం అని అన్నారు. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దృఢ సంకల్పం ద్వారానే ఇది సాధ్యమైందని అన్నారు. ధరణి కార్యక్రమం ప్రవేశపెట్టాలనే సంకల్పం కేవలం కేసీఆర్ కు తప్ప మరెవరు సాహసించలేరని పేర్కొన్నారు. 

     

ఈ సంవత్సర కాలంలో ధరణి ఊహించిన దానికన్నా విజయ వంతమైనదని, దీనికి నిదర్శనం ధరణి పోర్టల్ ను 5.14 కోట్ల మంది దర్శించారని, పదిలక్షలు పైగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగడమేనని వివరించారు. సి.ఎం. కేసిఆర్ నేతృత్వంలో అమలవుతున్న పలు విప్లవాత్మక పధకాల వల్ల రాష్ట్రంలో భూముల ధరలు ఒక్కసారిగా నాలుగైదు రేట్లు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో కేవలం ధరణి కార్యక్రమంవల్లే భూ రికార్డులు పటిష్టంగా ఉండడం, రికార్డులను తారు మారు చేసే పరిస్థితులు లేనందునే రాష్ట్రంలో ఏవిధమైన భూ వివాదాలు తలెత్తడం లేదని తద్వారా భూములు సురక్షితంగా ఉన్నాయని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.  గతంలో కేవలం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయని, ధరణి ప్రారంభం అనంతరం వీటికి అదనంగా 574 తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని గుర్తు చేశారు. 


ధరణి విజయవంతంగా కొనసాగడానికి ముందు ఎంతో మంది సీనియర్ అధికారులు వందలాది మంది ఐ.టి. నిపుణులు శ్రమించిన విషయాన్ని సీఎస్ గుర్తు చేశారు. ఈ సందర్బంగా ధరణి పోర్టల్ రూపకల్పనలో భాగస్వామ్యులైన అధికారులు తమ అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ కమీషనర్ శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు,  ప్రోహిబిషన్ ఎక్సైజ్  డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, తెలంగాణా టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ ఎం.డి.  జి.టి.వెంకటేశ్వర్ రావు,  పంచాయతీ రాజ్ కమీషనర్ డా.ఎ శరత్, సి.సి.ఎల్.ఎ. ప్రత్యేక అధికారిణి సత్య శారద ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T22:34:56+05:30 IST