సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో తెలంగాణ ప్రథమస్ధానం
ABN , First Publish Date - 2022-04-27T21:42:26+05:30 IST
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి కృషి చేసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు.
హైదరాబాద్: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి కృషి చేసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. దేశంలో ఎంపిక చేసిన ఉత్తమ గ్రామాల్లో మొత్తం 10 అగ్ర గ్రామాలు మన రాష్ట్రానికే చెందినవని, ఈ ఘనత సాధించినందుకు సంబంధిత అధికారులను అభినందించారు. అదేవిధంగా దేశంలోని 20 గ్రామాలలో మొదటి 19 గ్రామాలు తెలంగాణకు చెందినవని ప్రధాన కార్యదర్శి తెలిపారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో జరిగిన సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం రాష్ట్ర స్థాయి సాధికారత కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ పథకం అమలులో సాధించిన పురోగతిని ఆయన సమీక్షించారు.
ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ శరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.