Friends చెప్పారని ఆశపడ్డాడు.. తీరా చూస్తే రూ. 80 లక్షలు హాంఫట్
ABN , First Publish Date - 2022-04-26T12:32:23+05:30 IST
Friends చెప్పారని ఆశపడ్డాడు.. తీరా చూస్తే రూ. 80 లక్షలు హాంఫట్
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల ద్వారా పెద్దమొత్తంలో లాభాలు వస్తున్నాయని స్నేహితులు చెప్పడంతో ఆశపడిన ఓ వ్యక్తి రూ.80 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. సిటీ సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి మహేష్కు స్నేహితులు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల గురించి చెప్పారు. తక్కువ వ్యవధిలోనే మంచి లాభాలు వస్తున్నాయని అన్నారు. నమ్మిన మహేష్ తానూ పెట్టుబడులు పెడతానని చెప్పాడు. వారు అతడికి ఒక వెబ్సైట్ అడ్రెస్ చెప్పారు. అందులో అకౌంట్ ప్రారంభించిన మహేష్ ముందుగా రూ.30 వేలు పెట్టుబడి పెట్టాడు.
వారం రోజులలోనే లాభంతో కలిపి ఖాతాలో రూ. 50 వేలు బ్యాలెన్స్ చూపించింది. దీంతో మహేష్కు నమ్మకం కుదిరింది. గతేడాది నవంబర్ నుంచి విడతల వారీగా మొత్తం రూ.80 లక్షల భారీ మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. లాభంతో కలిపి ఖాతాలో బ్యాలెన్స్ రూ. కోట్లల్లో చూపిస్తుండడంతో కొంత మొత్తాన్ని విత్డ్రా చేయాలని మహేష్ ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు.. ఆ తర్వాత వెబ్సైట్ తెరుచుకోవడం మానేసింది. మోసపోయానని గుర్తించి సోమవారం సిటీ సైబర్ క్రైమ్స్లో ఫిర్యాదు చేశాడు.