హిడ్మా లాంటివాళ్లు కొద్దిరోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతారు : సీఆర్పీఎఫ్ చీఫ్

ABN , First Publish Date - 2021-04-09T00:11:26+05:30 IST

మావోయిస్ట్ కమాండర్ హిడ్మా విషయంలో సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లోనే హిడ్మా

హిడ్మా లాంటివాళ్లు కొద్దిరోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతారు : సీఆర్పీఎఫ్ చీఫ్

న్యూఢిల్లీ : మావోయిస్ట్ కమాండర్ హిడ్మా విషయంలో సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లోనే హిడ్మా లాంటి వారు ఇక చరిత్ర పుటలకే పరిమితమవుతారని, కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయారని, అతి త్వరలోనే ఓ పెద్ద ఆపరేషన్ చేపడతామని ప్రకటించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. గోడ చాటుగా నక్కి పోలీసులపై విరుచుకుపడుతున్నారని, ఇకపై వారి ముందు రెండే రెండు ఆప్షన్లు ఉంటాయని హెచ్చరించారు. వారిని ఏరిపారేయడం మొదటి ఆప్షన్‌ అని, లేదా వారంతట వారే పారిపోవడం రెండో ఆప్షనని పేర్కొన్నారు. ఇంతకు పూర్వం మావోయిస్టులు 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేవారని, ఇప్పుడు కేవలం 20 కిలోమీటర్లకే కుదించుకుపోయారని పేర్కొన్నారు.


ఒక్క ఏడాది లోపే వాళ్లు దాక్కున్న చోట్లలో జల్లెడ పట్టి, వారిని ఏరివేసేస్తామని, ఇది మాత్రం ఖాయమని ఘంటాపథంగా ప్రకటించారు. మరి హిడ్మా విషయం ఏంటని ప్రశ్నించగా... ‘‘కచ్చితంగా మాత్రం చెప్పలేను కానీ... అలాంటి వారు త్వరలోనే కాలగర్భంలో కలిసిపోవడం మాత్రం ఖాయం.’’ అంటూ వ్యాఖ్యానించారు. నక్సలైట్లు పన్నిన ఉచ్చులో భద్రతా బలగాలు  చిక్కాయన్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. చిక్కులో గనక చిక్కినట్లయితే మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండేదన్నారు. మరణించిన నక్సలైట్లను మిగతా నక్సలైట్లు నాలుగు ట్రాక్టర్లలో తీసుకెళ్లారని కుల్దీప్ సింగ్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-09T00:11:26+05:30 IST