ఉల్లికి.. ఊరట
ABN , First Publish Date - 2020-10-31T07:42:29+05:30 IST
భారీ వర్షాలు ఉల్లి రైతులను కోలుకోలేని దెబ్బతిశాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు పడటంతో దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు
డిమాండ్ పెరగడంతో ఉన్న పంటను అమ్ముకుంటున్న రైతులు
గద్వాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : భారీ వర్షాలు ఉల్లి రైతులను కోలుకోలేని దెబ్బతిశాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు పడటంతో దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోకవర్గంలో రైతులు ఎక్కువగా ఉల్లి పంటను సాగు చేశారు. ఈ నియోజకవర్గంలోని అలంపూర్, వడ్డేపల్లి, ఉండవెల్లి, మానవపాడు, రాజోలి మండలాల్లో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగును చేపట్టారు. ఎకరానికి 80 క్వింటాళ్ల నుంచి వంద క్వింటాళ్ల వరకు దిగుబడులు రావాల్సి ఉండగా, ఆగస్టు నుంచి అక్టోబరు వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలకు దాదాపు రెండు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కొద్దిపాటిగా మిగిలిన ఉల్లి సాగును చాలా మంది రైతులు వదిలేశారు. అయితే, పది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడం, కొద్దిపాటిగా ఎండకాయడంతో తడిగా ఉన్న భూమి పొడిగా మారింది. ఇదే సమయంలో ఉల్లి ధరలు ఒకేసారి పెరిగాయి.
క్వింటాళ్ లోకల్ ఉల్లికి రూ.4 వేలు, తెల్ల ఉల్లికి రూ.5 వేలు, మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లికి రూ.7 వేల చొప్పున మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మిగిలి ఉన్న ఉల్లి సాగువైపు దృష్టి సారించారు. చాలా మంది రైతులు వర్షాలకు విడిచి పెట్టిన ఉల్లిని, మళ్లీ భూమిల్లోంచి తీయిస్తున్నారు. ఇందు కోసం కర్నూలు నుంచి కూలీలను పిలిపిస్తున్నారు. ఉల్లి సాగుతో నష్టపోయినా, కొద్దిపాటిగా ఉన్న పంటనైనా అమ్ముకుంటే పెట్టుబడులు వస్తాయనే ఆశలో రైతులు ఉన్నారు. భూమిల్లోంచి తీసిన ఉల్లిని మళ్లీ గ్రేడింగ్ చేసి అరబోసి మార్కెట్కు తీసుకు వెళితే క్వింటాలుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల ధరలు పలికినా, ఎంతో కొంత నష్టం పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు.