ఆలయంలోకి మొసలి... పూజారి అభ్యర్థనతో వెనక్కి!

ABN , First Publish Date - 2020-10-22T16:30:01+05:30 IST

కేరళలోని ఒక ఆలయంలో అద్భుతం జరిగింది. పురాణకాలంలో మహర్షుల ఆదేశాలను వన్యప్రాణలు...

ఆలయంలోకి మొసలి... పూజారి అభ్యర్థనతో వెనక్కి!

తిరువనంతపురం: కేరళలోని ఒక ఆలయంలో అద్భుతం జరిగింది. పురాణకాలంలో మహర్షుల ఆదేశాలను వన్యప్రాణలు వినేవని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఇలాంటి ఉదంతమే కేరళలో చోటుచేసుకుంది. సాధారణంగా ఎవరికైనా సరే ఎదురుగా మొసలి కనిపిస్తే వణికిపోవడం సహజం. అయితే కేరళలోని ఆ ఆలయంలోకి వచ్చిన మొసలిని చూసిన స్థానిక పూజారి ఏమాత్రం భయపడలేదు. దానికి వినయపూర్వకంగా నమస్కారం పెట్టి బయటకు వెళ్లాలని కోరాడు. 



అంతే.. ఆ మొసలి ఆయన మాట విని, బయటకు వెళ్లిపోయింది. ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే కసరగడ్ జిల్లాలోని అనంతపుర ఆలయం సమీపంలో ఉన్న సరస్సులో ఒక శాఖాహార మొసలి ఉంది. దానిని బలియా అని పిలుస్తారు. చాలాకాలంగా అది ఆ ఆలయానికి పహారా కాస్తోంది. గుడిలో ఇచ్చే ప్రసాదం తప్ప మరే ఆహారాన్ని అది ముట్టదు. గతంలో ఆ మొసలి ఆలయం లోపలికి ఎప్పుడూ రాలేదని, ఇదే తొలిసారని ఆలయ ప్రధాన పూజారి చంద్ర ప్రకాష్ నంబీసన్ చెప్పారు. ఈ మొసలి గర్భగుడిలోకి ప్రవేశించిందని కొందరు చేసే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. కాగా ఈ మొసలి ఆలయానికి పహారా కాయడం వెనుక స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. 70 ఏళ్ల కిందట ఓ బ్రిటీష్ సైనికుడు ఈ సరస్సులో ఉన్న మొసలిని చంపేశాడట. తరువాత ఆ సైనికుడు పాము కాటుకు గురై చనిపోయాడట. ఆ దైవమే అతన్ని చంపిందని స్థానికులు అంటుంటారు. అయితే ఆ మొసలి మృతి చెందిన కొద్ది రోజులకే మరో మొసలి ఆ సరస్సులోకి వచ్చి చేరింది. ఇప్పుడది ఆలయానికి కాపలా కాస్తోంది. 

Updated Date - 2020-10-22T16:30:01+05:30 IST