ప్రాణం తీసిన సరదా

ABN , First Publish Date - 2022-08-09T05:41:44+05:30 IST

స్నేహితులతో కలసి సరదాగా హిమాయత్‌సాగర్‌ జలాశయానికి వెళ్లిన

ప్రాణం తీసిన సరదా

హిమాయత్‌సాగర్‌లో మునిగి ఆటో డ్రైవర్‌ దుర్మరణం 

రాజేంద్రనగర్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలసి సరదాగా హిమాయత్‌సాగర్‌ జలాశయానికి వెళ్లిన ఓ ఆటో డ్రైవర్‌ అందులో మునిగి మరణించాడు. కొడంగల్‌కు చెందిన దేవా (33) 2011లో కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి బండ్లగూడ పీ అండ్‌ టీ కాలనీలో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం మధ్నాహ్నం 2.30 గంటల సమయంలో దేవా స్నేహితుడు శ్రీను, ఇతరులతో కలిసి హిమాయత్‌సాగర్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తరువాత నలుగురు జలాశయంలో దిగి చేపలు పడుతుండగా దేవా, శ్రీను ఈత కోసం దిగారు. శ్రీను బయటకు రాగా దేవా నీటిలో మునిగిపోయాడు. అతని కోసం ఎంత వెదికినా ఫలితం లేకపోవడంతో శ్రీను, మిగిలిన వారు ఆటోలో ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రమైనా దేవా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య వెంకటమ్మ... శ్రీనును ప్రశ్నించింది. తనతో కాళీమందిర్‌ వరకే వచ్చాడని, తర్వాత ఎక్కడి వెళ్లాడో తెలియదని చెప్పాడు. అనుమానమొచ్చిన వెంకటమ్మ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి విచారణ చేస్తుండగా శ్రీను జరిగినదంతా ఆయనకు చెప్పా డు. ఆదివారం మద్యం తాగి జలాశయంలోకి దిగామని, దేవా నీటిలో మునిగిపోయాడని, భయంతో ఆ రోజు చెప్పలేదన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా దేవా మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 


Updated Date - 2022-08-09T05:41:44+05:30 IST