58 కిలోల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2022-08-09T06:06:50+05:30 IST
రైలులో ముంబైకి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
రైలులో ముంబై తరలిస్తున్న ఇద్దరికి రిమాండ్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రైలులో ముంబైకి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 58 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన దీనానాథ్, అనిల్ యాదవ్ కూలి పనిచేసుకొని జీవిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఈనెల 7వ తేదీ ఉదయం విశాఖ-నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో 58 కిలోల గంజాయి బ్యాగ్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగారు. ప్లాట్ఫాం 1పై ముంబై వెళ్లే రైలు కోసం వేచి ఉన్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు వారి వద్ద ఉన్న బ్యాగ్లను తనికీ చేయగా గంజాయి లభించింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా.. ముంబై తీసుకెళ్లి ప్యాకెట్లు చేసి అడ్డా కూలీలకు విక్రయిస్తున్నామని అంగీకరించారు. నిందితులను రిమాండ్కు తరలించారు.