గంటలోనే నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-08-08T05:55:19+05:30 IST

షాపు యజమాని దృష్టి మరల్చి బంగారు గొలుసు కాజేసిన వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గంటలోనే నిందితుడి అరెస్ట్‌

బౌద్ధనగర్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): షాపు యజమాని దృష్టి మరల్చి బంగారు గొలుసు కాజేసిన వ్యక్తిని చిలకలగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. లడ్డా సూరజ్‌ వారాసిగూడలో జువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో దుకాణంలో సూరజ్‌ ఒక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చి 20 గ్రాముల లోపు బంగారు గొలుసులు చూపించమని అడిగాడు. సూరజ్‌ ఓ గొలుసు చూపించాడు. మరిన్ని నగలను చూపించే లోపు ఆ వ్యక్తి 18 గ్రాముల బంగారు గొలుసు కాజేసి పారిపోయాడు. షాపు యజమాని వెంటనే చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీల ఆధారంగా గంట సమయంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు సరూర్‌నగర్‌ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఫిరోజ్‌గా గుర్తించారు. ఫిరోజ్‌ ప్రస్తుతం రాపిడో బైక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. నిందితుడి నుంచి గొలుసు స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పోలీస్‌ సిబ్బందిని నార్త్‌జోన్‌ డీసీపీ చందనాదీప్తి, గోపాలపురం ఏసీపీ ఎస్‌. సుధీర్‌ అభినందించారు. రివార్డు అందజేస్తామన్నారు.


Updated Date - 2022-08-08T05:55:19+05:30 IST