అల్లరి చేస్తున్నారని కన్నబిడ్డలను కడతేర్చాడు..
ABN , First Publish Date - 2020-03-22T15:54:30+05:30 IST
ఇంట్లో అల్లరి చేస్తున్నారని, దండించినా మారడం లేదనే కోపంతో ఏకంగా ఇరువురు కన్నబిడ్డలను గొంతునులిమి హతమార్చిన తండ్రి ఉదంతం బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఇంట్లో అల్లరి చేస్తున్నారని, దండించినా మారడం లేదనే కోపంతో ఏకంగా ఇరువురు కన్నబిడ్డలను గొంతునులిమి హతమార్చిన తండ్రి ఉదంతం బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్షయనగర్ అపార్ట్మెంట్లో నివసించే జితిన్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేరళకు చెందిన జితిన్ తమిళనాడుకు చెందిన లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. వారికి తౌశిని (5), ఏడాదిన్నర వయస్సు కలిగిన శాస్తి అనే పిల్లలు కలిగారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా జితిన్ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు శుక్రవారం ఇరువురినీ గొంతునులిమి చంపేశాడు. విధులు ముగించుకుని లక్ష్మి ఇంటికి రాగా ఇరువురు చిన్నారులు హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కన్నీరుమున్నీరైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుళిమావు పోలీసులు నిందితుడు జితిన్ను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను హతమార్చేందుకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.